● యువత లక్ష్యంగా సాగుతున్న గంజాయి దందా ● ఈజీ మనీకి అల
గంజాయికి బలైన కుటుంబం
జి.కొండూరు: యువతే లక్ష్యంగా గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. తేలికగా డబ్బు సంపాదించేందుకు అలవాటుపడిన యువకులతో గంజాయి రవాణా సాగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం గంజాయి దందా సాగిస్తోంది. పల్లె ప్రాంతాల్లో తరుచూ గంజాయి పట్టుబడటం ఇందుకు నిదర్శనంగా మారింది. యువతే లక్ష్యంగా గంజాయి మాఫియా ప్రత్యేక నెటవర్క్ను నడుపుతూ ఆన్లైన్ పేమెంట్లతో ముందుగానే ఆర్డర్లు తీసుకొని సరఫరా చేయడం నిఘా వ్యవస్థ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి రవాణా పల్లెల్లో విస్తరిస్తోంది. రేషన్, ఇసుక, మట్టి మాఫియా నిర్వాహకులు తమ దందాకు సెక్యూరిటీగా గంజాయి బ్యాచ్ను నియమించుకుంటున్నారని సమాచారం. ఇటీవల తిరువూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఓ మీడియా చానల్ డిబేట్లో మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు ప్రజాప్రతినిధి అనుచరులే భద్రాచలం నుంచి గంజాయి తెప్పించి తిరువూరులో విక్రయిస్తున్నారని ఆరోపించడం గమనార్హం.
తనిఖీల్లో చిక్కుతున్న గంజాయి
ఈ నెల 15వ తేదీన జి.కొండూరు మండలం చెవుటూరు శివారులోని పత్తి చేలల్లో పోలీసులు తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద 1.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందతుల్లో ఏలూరుకు చెందిన ఉత్తరవల్లి జగదీష్, విజయవాడకు చెందిన నలుగురు యువకులు, మైలవరంకు చెందిన ఒకరు, జి.కొండూరు మండలం వెంకటాపురానికి చెందిన ముగ్గురు యువకులు ఉన్నారు. తిరువూరు మండలం చిట్టేల క్రాస్రోడ్డు వద్ద ఈ నెల 21న బైకుపై వెళ్తున్న ముగ్గురు యువకులను పోలీసులు తనిఖీ చేయగా 1.5 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులు విశాఖపట్నం జిల్లాలోని సీలేరు నుంచి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముగ్గురు నిందితుల్లో ఒకరు తిరువూరుకు చెందిన యువకుడు, మిగిలిన ఇద్దరు విజయవాడకు చెందిన వారని, తరచూ గంజాయి రవాణా చేస్తున్నారని వెల్లడైంది. జగ్గయ్యపేట మండల పరిధి చిల్లకల్లు పోలీసుస్టేషన్ పరిధిలో గౌరవరం వద్ద ఒడిశా నుంచి హైదరబాద్కు రెండు ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న 10 కిలోల గంజాయి జూలై 24న పట్టుబడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు, కంచకచర్ల మండలం కీసరకు చెందిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచకచర్ల మండలం పరిటాల శివారులో ఈ ఏడాది జనవరి 23వ తేదీన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉన్న కారులో ఆరు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అదే నెల 24వ తేదీన జుజ్జూరురోడ్డులో రెండు బైకులపై తరలిస్తున్న నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదే నెలలో నందిగామ, చిల్లకల్లు పోలీసుస్టేషన్ల పరిధిలో సుమారు 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నందిగామ ఏసీపీ బాలగంగాధర్ తిలక్ అప్పట్లో ప్రకటించారు.
దాడి ఘటనలో గంజాయి కలకలం
గంజాయి మత్తుకు బానిసలవుతున్న యువకులు విచక్షణ కోల్పోయి రక్తసంబంధాలను మరిచి హత్యలకు తెగబడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 2024, డిసెంబరు 22వ తేదీన రాత్రి సమయంలో జి.కొండూరు మండలం కుంటముక్కల శివారులో ఇటుక బట్టీల వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ట్రాక్టర్లు పక్కకు తప్పుకునే విషయమై వివాదం తలెత్తింది. ఈ వివాదంలో ఒక ట్రాక్టరుపై ఉన్న యువకుడు సన్నీ తన స్నేహితులకు ఫోన్ చేశాడు. బైకుపై వచ్చిన ముగ్గురు యువకులు మరో ట్రాక్టరుపై ఉన్న యడవల్లి వెంకటేశ్వరరావు, సానం సాయిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే బాధితులకు మద్దతుగా ఇటుకబట్టీలలో కార్మికులు రావడంతో దాడి చేసిన యువకులు బైకులను వదిలేసి పారిపోయారు. ఈ బైకుల్లో గంజాయి దొరికింది. గంజాయి మత్తులోనే యువకులు దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు.
మైలవరానికి చెందిన చిందే బాజీకి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఐదుగురు కుమార్తెలు, రెండో భార్యకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాజీ గంజాయి వ్యాపారం చేసేవాడు. గంజాయి విక్రయ కేసులో బాజీతో పాటు అతని రెండో భార్య నాగేంద్రమ్మ ఈ ఏడాది మే 30వ తేదీన పోలీసులకు పట్టుబడ్డారు. మొదటి భార్య సాయంతో జైలు నుంచి విడుదలైన బాజీ జైలులో ఉన్న రెండో భార్య కుమార్తె చిందే గాయత్రిని ఆగస్టు 31వ తేదీన హత్య చేశాడు. గంజాయి కేసులో తన వివరాలను పోలీసులకు చెప్పిందనే కోపంతోనే ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తగా, వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే కోపంతో ఈ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించాడు. నిందితుడిపై మొత్తం పది గంజాయి, చోరీ కేసులు ఉన్నాయి. అతని వద్ద 27.170 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని పీడీయాక్టును ప్రయోగించారు. ఈ కేసులో బాజీ, అతని రెండో భార్య జైలుపాలవగా కుమార్తె చనిపోయి ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది.
● యువత లక్ష్యంగా సాగుతున్న గంజాయి దందా ● ఈజీ మనీకి అల


