గురుకులాల్లో ప్రకృతి సాగుకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో ప్రకృతి సాగుకు ప్రోత్సాహం

Oct 24 2025 8:06 AM | Updated on Oct 24 2025 8:06 AM

గురుకులాల్లో ప్రకృతి సాగుకు ప్రోత్సాహం

గురుకులాల్లో ప్రకృతి సాగుకు ప్రోత్సాహం

గురుకులాల్లో ప్రకృతి సాగుకు ప్రోత్సాహం మచిలీపట్నం–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు గుర్తు తెలియని మృతదేహం లభ్యం రూ.5 కోట్లు పలికిన కెనాల్‌రోడ్డు పార్కింగ్‌

జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశా

తిరువూరు:జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నామని, విద్యార్థులకు అవసరమైన ఆకుకూరలు, కాయగూరలు పండించేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశా తెలిపారు. తిరువూరు మండలం కాకర్ల, రామన్నపాలెం, ఏకొండూరు మండలం కృష్ణారావుపాలెం, ఏకొండూరు గ్రామాల్లో గురువారం కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణారావుపాలెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రకృతి సేద్యం ద్వారా సాగుచేస్తున్న దుంపజాతులు, తీగజాతులు, ఆకుకూరలు, కాయగూరలను పరిశీలించారు. తెగుళ్ళ నివారణకు ద్రవ జీవామృతం, ఘన జీవామృతాలను వాడాలని, రసాయన మందులను వినియోగించవద్దని సూచించారు. గురుకుల విద్యార్థులకు పోషక విలువలున్న కూరగాయలు అందించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రకృతి సేద్యంలో విద్యార్థుల్ని భాగస్వాముల్ని చేయాలన్నారు. రామన్నపాలెంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్న పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, దుంపలను కలెక్టర్‌ పరిశీలించి రైతుల అనుభవాలను తెలుసుకున్నారు. ఏకొండూరులో ధాన్యం సేకరణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌ రైతులతో మాట్లాడారు. తిరువూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారి కె.మాధురి, ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజరు శంకర్‌ నాయక్‌, ఏకొండూరు తహసీల్దారు లక్ష్మి, డీఎంఎం నాగేశ్వరమ్మ, తిరువూరు ఏడీఏ రంగారావు, వ్యవసాయాధికారి పి.పద్మ పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ):ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మచిలీపట్నం–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్‌ మండ్రుప్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24న మచిలీపట్నం–చర్లపల్లి (07642) రైలు, 26న చర్లపల్లి–మచిలీపట్నం (07641) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. రెండు మార్గాల్లో ఈ రైలు గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌లలో ఆగుతుందన్నారు.

పటమట(విజయవాడతూర్పు): విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని పటమటలో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించామని పటమట సీఐ పవన్‌ కిషోర్‌ తెలిపారు. ఆటోనగర్‌లో ఉన్న నవ్య బార్‌ వద్ద వ్యక్తి చనిపోయి ఉన్నాడని పేర్కొన్నారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన సిబ్బంది ఊరు, పేరు తెలియని సుమారు 30– 35 మధ్య వయసు గల ఒక మగ వ్యక్తి చనిపోయాడని గుర్తించామన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపారు. మృతుడి వివరాలు తెలియలేదని ఎవరైనా గుర్తిస్తే స్టేషన్‌ నంబరు, 0866–2542333, ఎస్‌ఐ నంబరు 9866216282 సంప్రదించాలన్నారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): విజయవాడ నగర పాలక సంస్థ చరిత్రలో ఒక పార్కింగ్‌ ప్రదేశానికి నిర్వహించిన ఈ ఆక్షన్‌లో రూ.ఐదు కోట్లకు పైగా పలికిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. దీంతో దీనిపై సర్వత్రా చర్చనీయాంశమైంది. విజయవాడ కెనాల్‌రోడ్డు వినాయకుని గుడి నుంచి బొడ్డు బొమ్మ సెంటర్‌ వరకూ వాహనాల పార్కింగ్‌కు సంబంధించి నగర పాలక సంస్థ ఈ ఆక్షన్‌ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు ఈ నెల ఒకటో తేదీన పత్రికల్లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. అందులో రూ.41,56,130 అప్‌సెట్‌ ధరగా నిర్ణయించారు. రూ.10,39,100 ఈఎండీగా నిర్ణయించారు. దానికి సంబంధించి 23వ తేదీ మధ్యాహ్నం బిడ్‌ తెరిచింది. దానిలో విజయవాడకు చెందిన జీఎం ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థ ఐదుకోట్ల 71 లక్షల 26 వేలకు, అలాగే కడపకు చెందిన మరో సంస్థ దానికి సుమారుగా ఆరు వేల తక్కువగా మరో టెండర్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. అయితే ఇది పొరపాటున సున్నా ఎక్కువ వేయటం ద్వారా ఇంత మొత్తం వేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఇద్దరూ దీనిని రద్దు చేసుకుంటే వారు చెల్లించిన ఈఎండీ పదిలక్షలు వదులు కోవాల్సి వస్తుంది. మొత్తం మీద ఇది నగర పాలక సంస్థలో చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement