
ఉచితంగా రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
చిలకలపూడి(మచిలీపట్నం): మహిళల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు అల్ట్రా సౌండ్, మామోగ్రామ్ వంటి పరీక్షల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. కలెక్టరేట్లో ఉచితంగా ఈ పరీక్షలు చేస్తామని తెలిపారు. ఈ వైద్య పరీక్షలు ప్రతి సోమవారం, గురువారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేస్తారని, ప్రతి మంగళ, శుక్రవారం క్షేత్రస్థాయిలో సంచార వాహనం ద్వారా ౖచేస్తారని వివరించారు. జేసీ ఎం.నవీన్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఏఓ రాధిక, వైద్యులు పాల్గొన్నారు.