
దుర్గమ్మకు కానుకగా బంగారు ముక్కుపుడక, బొట్టు, నత్తు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు గురువారం బంగారు ముక్కుపుడక, బొట్టు, నత్తును కానుకగా సమర్పించారు. బెంజ్సర్కిల్లోని ఆచార్యరంగ నగర్కు చెందిన పోసాని బసవయ్య, మనోహరమ్మ దంపతులు, వారి కుమారుడు ప్రసాదరావు సుమారు 24.7 గ్రాముల బంగారం, నవ రత్నాలతో తయారు చేయించిన ముక్కుపుడక, బొట్టు, నత్తును ఆలయ అధికారులకు అందచేశారు. సుమారు రూ. 3.05 లక్షలతో బంగారు ఆభరణాలను తయారు చేయించినట్లు దాతలు పేర్కొన్నారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు.
నానో ఎరువులతో బహుళ ప్రయోజనాలు
విజయవాడ రూరల్: నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వినియోగంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నున్న పీఏసీఎస్ను గురువారం ఆయన సందర్శించారు. రైతులకు ఎరువుల సరఫరా స్థితిగతులను పరిశీలించారు. ఈ పోస్ మెషిన్ పనితీరు పరిశీలించి, అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలను తెలుసుకున్నారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణం, గోదాము తనిఖీ చేశారు. ఫిజికల్, ఆన్లైన్ రికార్డుల లావాదేవీలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సాగుకు సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. 5,403 మెట్రిక్ టన్నుల యూరియా, 2,251 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1,052 మెట్రిక్ టన్నుల ఎంవోపీ, 2,310 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ, 12,292 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువులు, పురుగు మందులపై ఫిర్యాదులకు కలెక్టరేట్లో 91549 70454 నంబర్ అందుబాటులో ఉందని చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ నాగమల్లిక ఉన్నారు.
ముగిసిన షటిల్ బ్యాడ్మింటన్
క్రీడాకారుల ఎంపికలు
గన్నవరం: కేవీఆర్ ఇండోర్ స్టేడియంలో గురువారం కృష్ణాజిల్లా క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్–19 బాల, బాలికల షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు జరిగాయి. సెలక్షన్స్కు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బాలిబాలికలు హాజరయ్యారు. తొలుత పోటీలను జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ అధికారి కె.ఝాన్సీలక్ష్మి ప్రారంభించారు. అనంతరం బాల, బాలికల విభాగాల్లో వేర్వేరుగా పోటీలు నిర్వహించి క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. వీరు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని ఝాన్సీలక్ష్మి తెలిపారు. పోటీలను కేవీఆర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి కేవీఆర్ కిషోర్ పర్యవేక్షించారు. వ్యాయామ ఉపాధ్యాయులు రామారావు, బాలకృష్ణ, చంద్రశేఖర్, నాగరాజు, శాంతికిరణ్, రాంబాబు ఎంపికలు చేశారు.
ఓటమి భయంతోనే కూటమి దాడులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రజలకు మేలు చేసి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో దిగజారుడు రాజకీయాలకు పాల్పడాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి రాదని, కేవలం ఓటమి భయంతోనే దాడులకు తెగబడుతోందని వైఎస్సార్ సీపీ నాయీ బ్రాహ్మణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తొండమల్ల పుల్లయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ రౌడీ మూకల దాడిని ఖండించారు. ఇది అమానుష చర్య అని, రాజకీయం అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాబలంతో గెలవాలి తప్ప దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, తద్వారా ఎన్నికల్లో గెలవాలనుకోవడం దుర్మార్గ చర్యే అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి వ్యతిరేకతను మూటకట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేష్ యాదవ్పై జరిగిన దాడి బీసీ వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించారు.

దుర్గమ్మకు కానుకగా బంగారు ముక్కుపుడక, బొట్టు, నత్తు

దుర్గమ్మకు కానుకగా బంగారు ముక్కుపుడక, బొట్టు, నత్తు