
విద్యార్థులతో బంతాట
తాడేపల్లి రూరల్(గుంటూరు): కృష్ణాజిల్లా ఈడుపుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఐఐటీ నీట్ మహిళా అకాడమీ (గురుకుల పాఠశాల)ని మైలవరానికి తరలించవద్దని విద్యార్థులు సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ 2017లో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ నిధులతో నీట్, ఐఐటీ శిక్షణకు అద్దె భవనాలలో అకాడమీని స్థాపించారని తెలిపారు. దీనిలో ఇంటర్మీడియెట్తో పాటు లాంగ్ టర్మ్ మెడికల్, ఐఐటీలకు శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఏటా ఏడాది లాంగ్ టర్మ్తో కలిపి 220 మంది ఐఐటీకి, మరో 220 మంది విద్యార్థినులు నీట్ పరీక్షలకు హాజరు అవుతున్నారని చెప్పారు. అయితే అధికారులు అలసత్వం వహించి ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యను తగ్గించారని, నిర్ణీత సమయానికి అడ్మిషన్లు ఇవ్వకపోవడంతో ఆశయం పూర్తిగా నెరవేరలేదని విమర్శించారు. ఇప్పుడు అకాడమీని వేరే చోటుకు మారిస్తే మరిన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయని వాపోయారు. ఈ క్లిష్ట స్థితిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, భావితరాల వారి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ, ఈడుపుగల్లు భవనాల నుంచి విద్యార్థులను తరలించే కార్యక్రమాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈడుపుగల్లు నుంచి కుంటముక్కలకు ఐఐటీ నీట్ మహిళా అకాడమీ తరలింపు