చైర్మన్‌ ఎన్నిక నిర్వహించలేని అసమర్థ ఎమ్మెల్యే వసంత | - | Sakshi
Sakshi News home page

చైర్మన్‌ ఎన్నిక నిర్వహించలేని అసమర్థ ఎమ్మెల్యే వసంత

Jun 10 2025 7:18 AM | Updated on Jun 10 2025 7:18 AM

చైర్మన్‌ ఎన్నిక నిర్వహించలేని అసమర్థ ఎమ్మెల్యే వసంత

చైర్మన్‌ ఎన్నిక నిర్వహించలేని అసమర్థ ఎమ్మెల్యే వసంత

ఇబ్రహీంపట్నం: కొండపల్లి మున్సిపాలిటీకి గౌరవ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహించలేని అసమర్థ ఎమ్మెల్యేగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. సీల్ట్‌కవర్‌లో నిక్షిప్తమైన హైకోర్టు ఫలితాన్ని ప్రకటించకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి వాయిదా వేయించడంపై కౌన్సిలర్లు, వైఎస్సార్‌ సీపీ నాయకులతో కలిసి ఇబ్రహీంపట్నంలో ఆయన సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జోగి రమేష్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నిక ఫలితం మూడన్నరేళ్లుగా కోర్టు పరిధిలో ఉందన్నారు. సీల్డ్‌కవర్‌లో వచ్చిన ఫలితాన్ని నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎమ్మెల్యే వసంత ఉన్నాడని దుయ్యబట్టారు. టాస్‌ ద్వారా ఫలితాన్ని ప్రకటిస్తే వైఎస్సార్‌ సీపీ విజయం సాధించడం ఖాయమని భావించిన ఎమ్మెల్యే అధికారులపై ఒత్తిడి తెచ్చి వాయిదా వేయించడం సిగ్గుచేటు అన్నారు. నైతిక విజయం వైఎస్సార్‌ సీపీదే అని హర్షం వ్యక్తం చేశారు. టాస్‌ వేస్తే మున్సిపల్‌ చైర్మన్‌గా గుంజా శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌లుగా నల్లమోతు లక్ష్మి, బాడిస నాగరాజకుమారి చరిత్రాత్మక విజయం సాధించినట్లే అని స్పష్టం చేశారు. ఈనైతిక విజయాన్ని జగనన్నకు కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నిక ఫలితాన్ని ప్రకటించకుండా టీడీపీ ఫలాయనం చిత్తగించిందని ఎద్దేవా చేశారు.

సూపర్‌ సిక్స్‌ పేరుతో నమ్మించి మోసం చేశారు..

కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌ ఎన్నిక ఫలితంపై హైకోర్టు నుంచి సీల్డ్‌కవర్‌ వచ్చి 20 రోజులు దాటినప్పటికీ ఇన్ని రోజులు సమావేశం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. పాలకవర్గం లేక మున్సిపాలిటీలో కనీసం బ్లీచింగ్‌ కొట్టే పరిస్థితి లేదన్నారు. కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. శాసన సభ్యుడి చేతకాని తనంతో మూడున్నరేళ్లుగా పాలకవర్గం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. ఈసమయంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇంటింటికీ సంక్షేమ పథకాలు వచ్చేవనే ఆశాభావం ప్రజల్లో వ్యక్తమవుతుందని చెప్పారు. సమావేశంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ గరికపాటి శ్రీదేవి, వైఎస్సార్‌ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు పోరంకి శ్రీనివాసరాజు, రెంటపల్లి నాగరాజు, మున్సిపల్‌ కౌన్సిలర్లు జోగి రాము, గుంజా శ్రీనివాస్‌, మొగిలి దయాసాగర్‌, మోటూరి అరుణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడపాటి నాగిరెడ్డి, ఐటీ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు పచ్చిగోళ్ల పండు, నియోజకవర్గం వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికలో

నైతిక విజయం వైఎస్సార్‌ సీపీదే

హైకోర్టు ఫలితాన్ని ప్రకటించకుండా ఓటమి అంగీకరించిన టీడీపీ

మాజీ మంత్రి జోగి రమేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement