
యోగాతో ఒత్తిడి నియంత్రణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజలకు సేవలు అందించడంలో నిత్యం బిజీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులు యోగసాధన చేయడం ద్వారా ఒత్తిడిని జయించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా ఆయుష్ శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల జంక్షన్ వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ ఎన్జీవో, జేఏసీ నేతలు, ఉద్యోగులతో కలిసి పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒత్తిడిని జయించి, మంచి ఫలితాలు సాధించేందుకు యోగా ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజూ కొంత సమయాన్ని యోగాచరణకు కేటాయించాలని కలెక్టర్ సూచించారు.
యోగా జీవితంలో భాగం కావాలి..
ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. విద్యాసాగర్ మాట్లాడుతూ యోగా, ధ్యానం భారతీయ వారసత్వ సంపద అని పేర్కొన్నారు. ఉద్యోగులంతా యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. యోగాతో అద్భుత ఫలితాలు సాధించొచ్చన్నారు. పేద విద్యార్థులకు ఆర్టిస్టిక్ యోగాలో శిక్షణ ఇస్తూ, యోగాకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్న ట్రైనర్ బి.శిరీష ఇకపై కూడా కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా రూ. 10 వేలు తక్షణ సహాయం ప్రకటించారు. ఏపీ ఎన్జీవో జిల్లా కార్యవర్గ అధ్యక్షుడు డి.సత్య నారాయణ, సహాధ్యక్షుడు వీవీ ప్రసాద్, కార్యదర్శి పి.రమేష్, నగర శాఖ అధ్యక్షుడు సీవీఆర్ ప్రసాద్, కార్యదర్శి షేక్ నజీరుద్దీన్, యోగాంధ్ర నోడల్ అధికారి, డీఎంహెచ్వో ఎం.సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ