
మహాత్ముని కీర్తి శిఖరం గాంధీ కొండ
కలెక్టర్ లక్ష్మీశ
వన్టౌన్(విజయవాడపశ్చిమ): మహాత్ముని ఆశయాల కీర్తి శిఖరం గాంధీ కొండ అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ అన్నారు. గాంధీ హిల్పై యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా సోమవారం గాంధీహిల్పై గాంధీ హిల్ ఫౌండేషన్, జిల్లా యంత్రాంగం, ఏపీ టూరిజం శాఖల సంయుక్త ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్రలో భాగంగా ప్రజలకు యోగాతో కలిగే ప్రయోజనాలను వివ రించి జీవితాంతం ఆచరించేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాకు వచ్చే పర్యాటకులకు కూడా యోగా ఔన్నత్యంపై అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా తొలుత గాంధీ హిల్పై నిర్వహించామన్నారు. భవానీ ద్వీపం,డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం, కొండపల్లి ఖిల్లా తదితర ప్రాంతాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. యోగాచరణను నిత్యజీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకోవాలన్నారు. ఆరోగ్య భారత్ సాకారానికి కృషి చేసి మహాత్మునికి నిజమైన నివాళులు అర్పిద్దామన్నారు. కార్యక్రమంలో భాగంగా గాంధీజీ తాత్వికత, యోగా, సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే ప్రత్యేక ప్లానిటోరియం షో ప్రదర్శించారు. కార్యక్రమంలో గాంధీ హిల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గాంధీ పీసీ కాజా, కార్యదర్శి వై. రామచంద్రరావు, సభ్యులు శివశంకర్ కస్తూరి, రావి శారద పాల్గొన్నారు. బిహార్ యోగా విశ్వవిద్యాలయం ప్రతినిధి స్వామి భక్తి చైతన్య, ఏపీ టూరిజం ప్రతినిధులు శిల్ప, ప్రసన్నలక్ష్మి, కృష్ణచైతన్య, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.