
పట్టణ ప్రజలపై రూ.784 కోట్ల పన్నుల భారం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పట్టణ ప్రజలపై ఇంటి పన్నుల రూపంలో రూ.784 కోట్ల భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, కార్యవర్గ సభ్యుడు డి.కాశీనాథ్ ధ్వజమెత్తారు. విజయవాడలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో బాబూరావు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు రాష్ట్రంలోని 123 పట్టణాలు, నగరాల్లోని 40.22 లక్షల గృహాలు, ఇతర కట్టడాల సర్వేను ప్రారంభించారన్నారు. 20 శాతం ఇంటి పన్ను పెంపు లక్ష్యంగా సర్వే సాగుతోందన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి 15 శాతం ఇంటి పన్నులు పెంచారన్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం 35 శాతానికి తగ్గకుండా పన్ను పెంచేందుకు ఆగమేఘాల మీద ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీంతో పట్టణ ప్రజలపై రూ.784 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఈ పన్ను పెంపు రూ.1500 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదన్నారు. జూన్ 15వ తేదీ నాటికి రాష్ట్రంలోని పట్టణాల్లో ప్రతి ఇంటినీ సర్వే చేసి, కొలతలు తీసుకుని పన్నుల భారం మోపాలని నిర్ణయించిందన్నారు. టీడీపీ కూటమి ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని సమీక్షిస్తామని, పన్నుల భారాలు వేయబోమని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల భారం మోపతూ ప్రభుత్వం మాట తప్పి ప్రజలకు నమ్మకద్రోహం చేసిందన్నారు. కనీసం ప్రజలకు సమాచారం ఇవ్వకుండా ఏప్రిల్ నుంచి 15 శాతం ఇంటి పన్ను పెంచారన్నారు. అభ్యంతరాలు స్వీకరించకుండా వసూళ్లు కూడా ప్రారంభించారన్నారు. అంతటితో ఆగకుండా మరో 20 శాతంకు తగ్గకుండా పన్నులు పెంచడానికి ఆదేశాలివ్వడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క విజయవాడ నగరంలోనే ప్రజలపై రూ.40 కోట్ల మేర పన్నులు పెరిగాయన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివసించే పేదలపై అక్రమ నిర్మాణాల పేరుతో అదనపు భారం మోపుతారన్నారు. పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారాన్ని పూర్తిగా విస్మరించాయన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయని ప్రభుత్వం తొలి ఏడాది కానుకగా ఇంటి పన్నుల భారం మోపిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించి ఇంటింటి సర్వే ఆపాలని డిమాండ్ చేశారు. దీనిపై అవసరమైతే ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వ తొలి ఏడాది కానుక
తక్షణమే ఇంటింటి సర్వే ఆపాలి
ఇంటి పన్ను పెంపు నిలుపుదల చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు