
‘ప్లాస్టిక్ వినియోగాన్ని అంతం చేయాలి’
డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ పిలుపు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని ‘ప్లాస్టిక్ వినియోగాన్ని అంతం చేయాలి’ అనే నినాదంతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో రెండు వారాల పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా విజయవాడ రైల్వే డివిజనల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ పాల్గొని ప్లాస్టిక్ వాడకం కలిగే ముప్పును వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ వాడకం వలన జరిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు డివిజన్ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టామన్నారు. అందులో భాగంగా పర్యావరణ అనుకూల పద్ధతులు, డ్రెయిన్ల పరిశుభ్రత, మొక్కల పెంపకం, పర్యావరణ పద్ధతులను పాటించడం వలన కలిగే ప్రయోజనాలపై నాటక ప్రదర్శనల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోజు వారీ విధుల్లో పర్యావరణ అనుకూల పద్ధతులను పాటించాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించారు. పర్యావరణ పద్ధతులను పాటించేలా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు పీఈ ఎడ్వీన్, కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీఈహెచ్ఎం ఎం.కిశోర్, పలు బ్రాంచ్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.