పాతాళంలో మినుము ధర | - | Sakshi
Sakshi News home page

పాతాళంలో మినుము ధర

Apr 27 2025 2:00 AM | Updated on Apr 27 2025 2:00 AM

పాతాళ

పాతాళంలో మినుము ధర

కంకిపాడు: ఈ ఏడాది రబీ సీజన్‌లో కృష్ణాజిల్లా వ్యాప్తంగా 2,84,237 ఎకరాల్లో మినుము సాగు చేశారు. ఎల్‌బీజీ, పీయూ 31, టీబీజీ, ఘంటసాల, ఇతర సాధారణ రకాలను రైతులు సాగుకు ఎంచు కున్నారు. పంటలో బంగారు తీగ, పల్లాకు తెగులు ఆశించినా, పంట చేతికందిన తరుణంలో అకాల వర్షాలు కురిసినా దిగుబడుల్లో వ్యత్యాసం రాలేదు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ రైతులు పెట్టుబడులు పెట్టారు. ఎకరాకు ఏడు నుంచి ఎనిమిది బస్తాలకు తగ్గకుండా దిగుబడులు దక్కాయి. మాగాణిలో అక్కడక్కడా ఐదు బస్తాల వరకూ దిగుబడులు వచ్చాయి. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ మార్కెట్‌లో ధరలు పడిపోవటంతో రైతులు నీరసించిపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.7400 కాగా, బయటి మార్కెట్‌లోనూ అదే ధర ప్రారంభంలో దక్కింది. అయితే రోజురోజుకీ ధర పతనం అవుతూ ప్రస్తుతం క్వింటా రూ.6900కి పడిపోయింది. పెట్టుబడులు పోనూ, కనీసం కూలీ ఖర్చు కూడా చేతికి అందేలా లేదంటూ రైతులు వాపోతున్నారు.

కొనుగోలు కేంద్రాలు తెరిచినా...?

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే మినుముకు తక్కువ ధర లభిస్తుండటంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. దీంతో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాల్లో మినుము కొనుగోలు కేంద్రాలను మార్చి 19 నుంచి అందుబాటులోకి తెచ్చారు. మార్క్‌ఫెడ్‌ అధికారుల లెక్కల ప్రకారం మోదుగుమూడి, మల్లేశ్వరం, ఆరుగొలను, పెరికీడు, గుడ్లవల్లేరు, కంకిపాడు, మొవ్వ, పెడన, గంగూరు, బొడ్డపాడు, ఆత్కూరు, ఉయ్యూరులో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,84,237 ఎకరాల్లో మినుము సాగు జరిగింది. కేవలం 12 కేంద్రాల్లోనే కొనుగోలు కేంద్రాలను తెరిచారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు పంట తరలించటం, కూలీలతో జల్లెడ, కాటా వేయించే పనులకు రైతులే అదనంగా పెట్టుకోవాల్సి వస్తోంది. దూర ప్రాంతంలో ఉన్న కొనుగోలు కేంద్రాలకు పంటను తరలించేందుకు రవాణా ఖర్చులు, కూలీల ఖర్చులు రూ.4 వేలు–రూ.6 వేల వరకూ అవుతుండటంతో కొనుగోలు కేంద్రాల వైపు రైతులు మొగ్గుచూపటం లేదు.

దిగుబడి బాగున్నా... ధర లేదన్నా..

సిండికేట్‌ మాయ

రైతులపై పడుతున్న అదనపు పెట్టుబడి భారాన్ని ఆసరాగా చేసుకున్న దళారీలు స్థాని కంగా రేటు పెరగకుండా నిరోధిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌లో ధరను నిర్ణయించటంలో సిండికేట్‌ పాత్ర ఉందనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. అదే లేకపోతే గత సీజన్‌లో రూ.9200 నుంచి రూ.9800 పలికిన ధర నేడు అమాంతం రూ.6900కి ఎలా తగ్గుతుందని ప్రశ్నిస్తున్నారు. దళారుల చేతిలో రైతులు నిట్టనిలువునా దోపిడీ అవుతున్నారని స్పష్టమవుతోంది. ఇంత జరుగు తున్నా ప్రభుత్వం చలించటం లేదు. రైతు సేవా కేంద్రాల్లో రబీ ధాన్యం మాదిరిగా మినుము కొనుగోళ్లు చేపడితే రవాణా ఖర్చుల భారం తగ్గి, కనీసం మద్దతు ధర అయినా దక్కుతుందనే భావన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తిగా ధర పతనం

నేను ఎకరం విస్తీర్ణంలో మినుము సాగు చేశాను. దిగుబడి అందరికీ బాగానే వచ్చింది. నాకు మాత్రం ఐదు క్వింటాళ్లే వచ్చింది. మార్కెట్‌లో ధర పూర్తిగా తగ్గిపోయింది. ఆ రేటుకు అమ్మితే ఖర్చులు కూడా రావు. చేసేది లేక పంటను ఇంటిలో నిల్వ చేశా. మంచి ధర వస్తే అమ్ము దామని చూస్తున్నా.

–బీహెచ్‌ రాజగోపాల్‌రెడ్డి, రైతు, ప్రొద్దుటూరు

సిండికేట్‌ దోపిడీ

వ్యాపారులు సిండికేట్‌ అయిపోయారు. గత సీజన్‌లో రూ.9200 ఉన్న ధర ఈ ఏడాది పడిపోవటానికి వారే కారణం. అదేమంటే బర్మా నుంచి మినుము దిగుమతి అవుతోందంటున్నారు. ఆర్‌ఎస్‌కేల్లో మినుము కొనుగోలు చేయాలి.

–కొండవీటి సుబ్బారావు, రైతు, మంతెన

పాతాళంలో మినుము ధర1
1/2

పాతాళంలో మినుము ధర

పాతాళంలో మినుము ధర2
2/2

పాతాళంలో మినుము ధర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement