
తటాకాలు కావివి.. పంట పొలాలే!
పెనుగంచిప్రోలు: గత ఏడాది సెప్టెంబర్ నెలలో మునేరుకు వచ్చిన భారీ వరద రైతులకు తీరని వేదన మిగిల్చింది. ఆ వరదలకు మునేరు తువ్వ కాలువకు గండ్లు పడి వత్సవాయి మండలం వేములనర్వతో పాటు పెనుగంచిప్రోలు మండలంలోని పెనుగంచిప్రోలు, ముచ్చింతాలకు చెందిన 220 ఎకరాల్లో పైగా పంట భూములు కోతకు గురయ్యాయి. వరదలకు పంట కొట్టుకు పోవటంతో పాటు పొలాలు కోతకు గురై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా మునేరుకు వచ్చిన వరదతో పక్కనే కాలువకు పెద్ద పెద్ద గండ్లు పడి ఒక్కో చోట 10 నుంచి 15 అడుగుల గోతులు పడ్డాయి. మునేరుకు వరదలు వచ్చి 8 నెలలు అవుతున్నా కోతకు గురై గుంతలు పడిన భూముల్లో నేటికీ వరద నీరు అలానే ఉంది. దీంతో అవి తటాకాల్లా దర్శనమిస్తున్నాయి. రైతులు ఆ భూముల్లో నీటిని తోడేసి, మట్టితో చదును చేయాలంటే ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో రైతులు అంత పెట్టుబడి పెట్టలేక అలానే ఉంచేశారు. ఇప్పటికే ఖరీఫ్, రబీ రెండు సీజన్లు పోయాయి. మళ్లీ ఖరీప్ సీజన్ రానుంది. దీంతో తమ పరిస్థితి ఏమిటని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమకు ప్రభుత్వం నుంచి కొంత తోడ్పాటు అవసరమని అంటున్నారు.
ఇసుక మేటలు తొలగించుకుంటున్న రైతులు...
ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా లేకపోవటంతో కొందరు రైతులు ఇక తప్పనిసరై వరద ముంపునకు తమ పొలాల్లో ఇసుక మేటను సొంతంగా తొలగించుకుంటున్నారు. కొందరు రైతులు జేసీబీ, ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని అవసరమైన రైతులకు తోలుతున్నారు. కొన్ని పొలాల్లో 3 నుంచి 4 అడుగుల మేర ఇసుక మేట ఉంటే కొన్ని చోట్ల 6 నుంచి 7 అడుగుల వరకు ఉంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేచి చూస్తున్న రైతులు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో తమకు తామే ఇసుక మేటలు తొలగించుకుని ఖరీప్ సాగు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు.
కోలుకోలేని దెబ్బ తీసిన మునేరు వరద 8 నెలలవుతున్నా నేటికీ తొలగని వరద నీరు దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు సొంతంగా ఇసుక మేటలు తొలగించుకుంటున్న వైనం

తటాకాలు కావివి.. పంట పొలాలే!