బాన్సువాడ రూరల్ : కొడుకు పుట్టాడనే సంతోషంలో ఉన్న తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన బీర్కూర్ మండలం అన్నారం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండలం పొతంగల్ ఖుర్దు గ్రామానికి చెందిన చాకలి శేఖర్(28) బీర్కూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన చాకలి కృష్ణవేణి ఇంటికి ఇల్లరికం వచ్చాడు. మృతుడికి భార్య లావణ్య, ఏడాదిన్నర కూతురు ఉండగా నాలుగు రోజుల క్రితమే కుమారుడు జన్మించాడు. సొంతూరు పొతంగల్ ఖుర్దుకు వెళ్లి ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై అత్తారింటికి వస్తుండగా కొల్లూర్ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా ఎదురుగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో చాకలి శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అత్త కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ సీఐ తుల శ్రీధర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.


