అబ్బుర పరచిన ఇంద్రజాలం
నిజామాబాద్ రూరల్ : వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా జిల్లా బాల భవన్ ప్రాంగణంలో సోమవారం జాదూ యుగంధర్ రంగనాథ్ ఇంద్రజాల ప్రదర్శన చిన్నారులందరినీ మాయలోకంలోకి తీసుకుపోయింది. చప్పట్లు కేరింతలతో బాల భవన్ కోలాహలంగా మారిపోయింది. ప్రదర్శన ఆరంభం నుంచి చివరి వరకు నవ్వులు, అరుపులతో దద్దరిల్లింది. చేతిలో ఆస్ట్రిచ్ పసుపురంగు ఈకతో వేదిక మీదికి వచ్చిన జాదూ రంగనాథ్ దాన్ని మ్యాజిక్ స్టిక్గా మార్చటం, రంగురంగుల కర్చీఫ్ నుంచి రకరకాల పూలను సృష్టించాడు. వివిధ రూపాల్లో మ్యాజిక్ చేస్తూ చిన్నారులను ఆకట్టుకున్నారు. అనంతరం బాల భవన్ సూపరింటెండెంట్ మల్లాది ఉమాబాల ఇంద్రజాలికుడు రంగనాథ్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ పర్యవేక్షకుడు ప్రభాకర్, వెంకటలక్ష్మి, పుష్పలత, మాధవి, శ్వేత, రిచ, మాధవి, నవీన్, రాంచందర్, గణేశ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.


