నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ ప్రాంతంలో ఉన్న రైస్ మిల్లులను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లక్ష్మీబాలాజీ, శ్రీ సిద్ధి రామేశ్వర రైస్ మిల్లులను సందర్శించిన కలెక్టర్.. కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం వచ్చింది? దిగుమతి చేసుకున్నారా? ఎక్కువగా ఏ రకం ధాన్యం వస్తోంది? ఎంత పరిమాణంలో మిల్లింగ్ పూర్త య్యింది? మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు.. తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిల్లుల వద్ద ఏమైనా తరుగు తీస్తున్నారా అని ఆరా తీశా రు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యాన్ని వెంటవెంటనే దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. అవసరమైతే ఎక్కువ సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ధాన్యం నిల్వ చేసేందుకు సమీపంలోని రైతు వేదికలను వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం ప్రవీణ్, రైస్ మిల్లుల నిర్వాహకులు వి మోహన్రెడ్డి, శ్రవణ్ కుమార్ తదితరులున్నారు.
ప్రశాంతంగా పాలిసెట్
ఖలీల్వాడి: జిల్లాలో పాలిసెట్ బుధవారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొ త్తం 6490 మంది విద్యార్థులకు గాను 5,984 మంది హాజరుకాగా.. 506 మంది గైర్హాజరయ్యారు. ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వారిలో బాలురు 2,808 మంది, బాలికలు 3176 మంది ఉన్నారు. బాలురు 239 మంది, బాలికలు 267 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షాకేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అయితే ముందస్తు సూచనలు చేయకుండానే చాలా సెంటర్ల వద్ద విద్యార్థుల ఆధార్కార్డు అడగడంతో వారు ఇబ్బందులు పడ్డారు. దగ్గరలోని ఇంటర్నెట్ సెంటర్లకు, ఇళ్లకు పరుగులు తీశారు. సెంటర్లకు వచ్చిన తరువాత ఆధార్ కార్డు అడుగుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
ఖలీల్వాడి: జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మొదటి రోజైన బుధవారం ప్రశాంత వాతావరణంలో కొనసాగాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఒకేషనల్లో జనరల్ ఫౌండేషన్ కోర్స్ పరీక్షలు జరిగాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 38 సెంటర్లలో పరీక్షలు కొనసాగగా, ఫస్టియర్ విద్యార్థులు 4,009 మందికిగాను 3,752 మంది, సెకండియర్ విద్యార్థులు 1401 మందికిగాను 1319 మంది హాజరైనట్లు డీఐఈవో వివరించారు.
కలెక్టర్ను కలిసిన డీఆర్వో
నిజామాబాద్అర్బన్: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా బి గీత బుధవారం బాధ్యత లు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ను మ ర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. పలు అంశాలపై వారిద్దరు చర్చించారు.


