మాక్లూర్: మాక్లూర్ సొసైటీ పాలకవర్గం, అందులో పని చేసే కార్యదర్శులు, సిబ్బంది కలిసి సొంతానికి వాడుకున్న రూ. 3కోట్ల 24లక్షల డబ్బును ఏళ్లు గడుస్తున్నా ఇంకెప్పుడు రికవరీ చేస్తారని రైతులు అధికారులను నిలదీశారు. సొసైటీ కార్యాలయానికి తాళం వేసి ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలోని మాక్లూర్ సొసైటీ ప్రాంగణంలో మంగళవారం క్లస్టర్ అధికారి స్వప్న అధ్యక్షతన 84వ మహాజన సభ నిర్వహించారు. సొసైటీకి సంబంధించి జమఖర్చులను కార్యదర్శి రతన్ చదివి వినిపించారు. మొదటగా ఎవరు ఎంత బకాయి ఉన్నారనేది చదివి వినిపించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన కల్లెడికి చెందిన సంతోష్ అనే కార్యదర్శిపై రూ.1కోటి 20లక్షల బకాయి ఉండటమేమిటని అధికారులను నిలదీశారు. ఇలా గత రెండు, మూడు పాలకవర్గాలు కలిసి ఇంత పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడితే.. అధికారులుగా మీరేం చేశారని క్లస్టర్ అధికారి స్వప్న, పర్సన్ ఇన్చార్జి చైర్మన్ ఫిరోజ్ ఖాన్లను ప్రశ్నించారు. వాటిని రికవరీ చేసేవరకు ఈ సమావేశాలు వద్దంటూ వాదనకు దిగారు. కొందరు సొంతానికి వాడుకున్న రూ.3 కోట్ల 24 లక్షలను తప్పకుండ రికవరీ చేస్తామని, అందుకు ఒక ప్రొసీజర్ ఉంటుందని క్లస్టర్ అధికారి స్వప్న తెలిపారు. తరచూ ఇదే మాట చెబుతున్నారు కానీ, చేసిందేమిలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను వాకౌట్ చేశారు. సొసైటీ ప్రధాన గేటు వద్దకు వెళ్లి తాళం వేసి అక్కడ కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
మాక్లూర్ సొసైటీ మహాజనసభలో
అధికారులను నిలదీసిన రైతులు
కార్యాలయానికి తాళం వేసి, ధర్నా
రూ.3కోట్ల 24 లక్షలను వెంటనే రికవరీ చేయాలని డిమాండ్


