నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ జిల్లా న్యాయవాద పరస్పర సహకార సొసైటీకి 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను నూతన కార్యవర్గం కోసం ఏప్రిల్ 24న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్, పులి జైపాల్ తెలిపారు. ఈసందర్భంగా మంగళవారం ఎన్నికల ప్రక్రియ వివరాలను వారు వెల్లడించారు. మొత్తం 12 మంది డైరెక్టర్లకు గాను నిజామాబాద్కు చెందిన 4 నాలుగు డైరెక్టర్ పోస్ట్ల ఎన్నికకు నామినేషన్ పత్రాల స్వీకరణ ఏప్రిల్ 15, 16 తేదీలలో నిర్వహిస్తామన్నారు. 17న నామినేషన్ పరిశీలన, 20 లోపు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంటుందని అదేరోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారన్నారు. 24న ఎన్నికలు నిర్వహించి, అదేరోజు పూర్తిస్థాయి సొసైటీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలోని సహకార సొసైటీ న్యాయవాద సభ్యులందరూ ఈ ఎన్నికల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు.


