● అక్షరాస్యతలో జిల్లా వెనుకంజ
● జిల్లాలో 6.70 లక్షల మంది
నిరక్షరాస్యులు
● 29న ఎన్ఐవోఎస్ ఎగ్జామ్
ఖలీల్వాడి : నిరక్షరాస్యులుగా ఉన్న మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఉల్లాస్’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దానిని రాష్ట్ర ప్రభుత్వం ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం పేరిట చదువు రాని వారికి చదువు నేర్పించేందుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లోని మహిళా సంఘాల సభ్యులతో కాలనీలు, వార్డుల్లో నిరక్షరాస్యులను గుర్తించి వారికి అక్షరాలు నేర్పించారు. గతేడాది అక్టోబర్ 27న ప్రారంభమైన కార్యక్రమం 150 రోజులు కొనసాగింది. అయితే, ఉల్లాస్ కార్యక్రమంతో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కాగా, ఈ నెల 29న చదువుకున్న వారికి అధికారులు ఎస్ఐవోఎస్ పరీక్ష నిర్వహిస్తున్నారు.
ఫలితాలు అంతంత మాత్రమే..
అక్షరాస్యతలో జిల్లా వెనుకబడే ఉన్నట్లు 2011 గణాంకాలు చెబుతున్నాయి. అక్షర్యాసతను పెంపొందించడానికి ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా సత్ఫలితాలివ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
● జిల్లాలో 2,63,544మంది పురుషులు, 4,07,042 మంది మహిళలు రాయడం, అక్షరాలు గుర్తించని వారు ఉన్నారని వయోజన విద్య అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో నిరక్షరాస్యులు లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. మహిళా సంఘాల సభ్యులు నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించారు. పరీక్షకు 29,943 మంది హాజరవుతారు.
– పురుషోత్తం, డీడీ, వయోజన విద్యాశాఖ
అక్షరాస్యత వివరాలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా అధికారులు స్వచ్ఛందంగా చదువు చెప్పే మహిళా సంఘాల సభ్యులను గుర్తించారు. వారికి ఎలాంటి గౌవర వేతనం లేదు. దీంతో మహిళా సంఘాల సభ్యులు అంతగా స్పందించనట్లు తెలుస్తోంది. జిల్లాలో అక్షర వికాసం ద్వారా 59,049 మంది విద్యనభ్యసించారు. అయితే, వీరిలో 29,943 మంది ఎన్ఐవోఎస్ పరీక్ష రాయనున్నారు. నిర్ణీత తేదీన ప్రతి గ్రా మ పంచాయతీ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష నిర్వ హిస్తున్నట్లు వయోజన శాఖ అధికారులు తెలిపారు. మహిళలు తమకు అనుకూలంగా ఉన్న సమయంలో 3 గంటలపాటు పరీక్ష రాయాల్సి ఉంటుంది. అనంతరం వారికి సర్టిఫికెట్లను అందజేయనున్నారు.


