డిచ్పల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)– 2026 పై బూత్ లెవెల్ అధికారులకు బుధవారం డిచ్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ శిక్షణనిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బీఎల్వోలు నిర్వర్తించవలసిన విధులు, ఎన్యుమరేషన్ ఫారం నింపాల్సిన విధానం, క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ల సహకారంతో ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీవో ఆదేశించారు. తహసీల్దార్ సతీష్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ లు సంతోష్, భూపతిప్రభు, పర్యవేక్షకులు, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్పై బీఎల్వోలకు శిక్షణ
మోపాల్: మండలకేంద్రంలోని రైతు వేదికలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై బీఎల్ఓలు, సూపర్వైజర్లు, జీపీవోలకు బుధవారం తహసీల్దార్ ఎన్ రేఖ, ట్రైనీ ఆఫీసర్ ప్రవీణ్రెడ్డి శిక్షణనిచ్చారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా బీఎల్ఓలు పని చేయాలని, ఇందుకోసం రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల సహకారం తీసుకోవాలని తహసీల్దార్ రేఖ సూచించారు.ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.


