రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
వర్ని: మండల కేంద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జలాల్పూర్ గ్రామానికి చెందిన గుండ్ల నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. వీక్లీ మార్కెట్ నుంచి తన టీవీఎస్ ఎక్సెల్ పై వస్తున్న నారాయణకు వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 సిబ్బంది బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. మూల మలుపుల వద్ద పండ్ల దుకాణాలు, మిర్చి బండ్లు ఉండడం వల్ల వాహనాలు కనబడక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పటిక, బెల్లం పట్టివేత
ధర్పల్లి: మండలంలోని దుబ్బా క గ్రామంలో టాస్క్ఫోర్స్ అధికారులు కిరాణా దుకాణాల్లో మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. అధికారుల దాడుల్లో వినాయక కిరాణా దుకాణంలో 90 కిలోల బెల్లం, 70 కిలోల పటికను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణ యజమాని గోసికొండ ప్రశాంత్పై కేసు నమోదు చేసి తహసీల్దార్ శాంత ఎదుట బైండోవర్ చేసినట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ విశాల్ బుధవారం తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా గుడుంబాను తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నాటుబాంబు కలకలం!
● అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో
గేదెకు తీవ్ర గాయాలు
● వేటగాళ్ల పనే అంటున్న గ్రామస్తులు
సదాశివనగర్: అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శివారులో నాటు బాంబు కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తు లు వన్యప్రాణులను పట్టుకోవడం కోసం తవుడులో నాటు బాంబును పెట్టారు. మేత మేసుకుంటూ వెళ్లిన అడ్లూర్ ఎల్లారెడ్డిలోని కుమ్మరి శ్రీనివాస్కు చెందిన గేదె.. ఆ తవుడును తినగా నాటు బాంబు పేలి తీవ్రంగా గాయపడింది. బాధితుడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.


