● వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు
తెయూ(డిచ్పల్లి): ఔషధాల తయారీ సమాజ క్షేమమే పరమావధిగా కొనసాగాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు పేర్కొన్నారు. తెయూ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘ఇన్నోవేషన్స్ ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీ’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సును వీసీ యాదగిరిరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔషధ తయారీలో రసాయన శాస్త్ర ప్రాముఖ్యత ఎంతో గొప్పదన్నారు. యువ శాస్త్రవేత్తలు నిబద్ధతతో తమ లక్ష్యాలను సాధించి భారత్ ఇప్పటికే సాధించిన ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. సదస్సులో ముఖ్యవక్తగా హాజరైన అరబిందో ఫార్మసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సురేశ్ మాట్లాడుతూ.. యువ శాస్త్రవేత్తలు జనరిక్ మెడిసిన్ పై లోతైన పరిశోధనలు చేసి వాటిని పేద ప్రజలకు మరింత దగ్గర చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ లింగయ్య నాగారపు, డాక్టర్ శంకరయ్య, కన్వీనర్ సాయిలు, కో కన్వీనర్ డీ నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీస్ ఏ నాగరాజు, బాలకిషన్, అధ్యాపకులు గంగా కిషన్, రాజేశ్వరి, డేనియల్, సురేశ్, నాగేశ్వరరావు, నాగేంద్రబాబు, సునీత, శర్మ, శ్రీకాంత్, వివిధ విభాగాల ఆచార్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


