నిజామాబాద్అర్బన్: విధులను నిర్లక్ష్యం చేస్తే సస్పెన్షన్తోనే సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ప్రజావాణి అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షల సందర్భంగా ఇటీవల ఓ ఎస్జీటీ వ్యవహరించిన తీరును కలెక్టర్ ప్రస్తావించారు. బాధ్యతాయుతమైన విధుల్లో కొనసాగుతూ, విద్యార్థుల భవిష్యత్కు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్తో పాటు సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు.
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ప్రతి నివాస ప్రాంతానికి ప్రజల అవసరాలకు సరిపడా శుద్ధ జలాలు సరఫరా అయ్యేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. అవసరమైన చోట్ల చిన్నచిన్న మరమ్మతులను వెంటనే చేయించాలని, పైప్ లైన్ లీకేజీలను యుద్ధప్రాతిపదికన నివారించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చే స్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో స్పష్టమైన పురోగతి సాధించేలా చొరవ చూపాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకునేలా లబ్దిదారులను ప్రోత్స హించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సస్పెన్షన్తో సరిపెట్టేది లేదు..
ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణలో
అవకతవకలకు తావివ్వొద్దు
ప్రతి ఇంటికీ శుద్ధ జలాలు
అందించండి
సమీక్ష సమావేశంలో
కలెక్టర్ ఇలా త్రిపాఠి


