సుభాష్నగర్: ఉత్తర తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కలిసి విన్నవించారు. నిజామాబాద్ జంక్షన్లో పిట్లైన్, కోచింగ్ డిపో ఏర్పాటు, పలు రైళ్ల పొడిగింపు, పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలకు ఆమోదం వంటి అంశాలు ప్రాంతీయ అభివృద్ధికి ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా నవీపేట్, ఇందల్వాయి వద్ద ఆర్వోబీలు, డిచ్పల్లి, అక్కన్నపేట వద్ద ఆర్యూబీ నిర్మాణాల ప్రక్రియను వేగవంతం చేయాలని, జానకంపేట్ వద్ద ఆర్యూబీ, రైళ్ల పొడిగింపు, నిజామాబాద్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ మీదుగా తిరుపతికి రైళ్లు, నిజామాబాద్ మీదుగా వందే భారత్ ట్రైన్లను త్వరితగతిన అమలు చేయాలని కోరారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని ఎంపీ అర్వింద్ రైల్వే మంత్రిని కోరారు. తన విన్నపం మేరకు ఎడపల్లి వద్ద ఆర్వోబీ, డిచ్పల్లిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఆర్మూర్ – ఆదిలాబాద్ రైల్వేలైన్ పనులు మంజూరు చేయడంపై రైల్వే మంత్రికి ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.
విద్యాశాఖ అధికారిణిపై కలెక్టర్ సీరియస్!
ఖలీల్వాడి: జిల్లా విద్యాశాఖలో పని చేస్తున్న అధికారిణిపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయినట్లు తెలిసింది. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల వివరాలను కలెక్టర్ అడగగా.. సూపరింటెండెంట్ తన వద్ద వివరాలు లేవని సమాధానమిచ్చారు. ఎవరికి సమాచారం ఉంటుందని ప్రశ్నించిన కలెక్టర్.. ఓ ఉన్నతాధికారిణిని పిలిపించి వివరాలు అడగగా ఆమె చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వివరాలు తెలియకుంటే ఇక్కడ ఎందుకు ఉన్నారు.. వెళ్లిపోండి అంటూ కలెక్టర్ మండిపడ్డినట్లు సమాచారం.


