నగరంలో సోషల్ ఇంజినీరింగ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జనవరిలో మున్సి పల్ ఎన్నికలు నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభు త్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్ నగరపాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనే అంశంపై రాజకీయ, వివిధ వర్గాల్లో అనేక అనుమానాలు ఉన్నాయి.
ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ బలంగా ఉంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్తో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి నగరపాలకంలో పాగా వేసేందుకు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. మరోవైపు సంఘ్ పరివార్ సైతం ఇప్పటికే పలువిడతలుగా గ్రౌండ్ వర్క్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల పలు విడతల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారుగా చేయించుకున్న సర్వేల్లోనూ బీజేపీ గెలుపునకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తేలింది.
మొత్తం 60 డివిజన్లకు గాను గత ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాలు గెలుచుకుంది. ఎంఐఎం 16 డివిజన్లు, బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ రెండు, స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు. దీంతో అ ప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిసి ఎక్స్అఫీషియో ఓట్ల ద్వారా అధికారం దక్కించుకుంది. అయితే ఈసారి బలం మరింత పెరగడంతో పాటు ఎంపీ, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేల ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్న నేపథ్యంలో నగరపాలకంపై జెండా ఎగురవేయాలని బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్ల టిక్కెట్ల కోసం చాలామంది నాయకులు పోటీపడుతుండడం పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది.
● నగరంలో బీజేపీ హవాను తగ్గించి, నగరపాలకంలో పాగా వేసేందుకు గాను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. కీలకమైన ఈ బల్దియా విషయమై పీసీసీ అధ్య క్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి, షబ్బీర్అలీలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నగరంలో సోషల్ ఇంజినీరింగ్కు రంగం సిద్ధం చేస్తున్నారు. నగరంలో గెలుపోటములను పూర్తిస్థాయిలో ప్రభావితం చేయడంలో మున్నూరుకాపు, ముస్లిం మైనారిటీ, పద్మశాలి కులాలు అత్యంత ప్రభావితంగా ఉంటూ వస్తున్నాయి. దీంతో ఈ కులాల వారి ఓట్లను గంపగుత్తగా దక్కించుకుని అత్యధిక డివిజన్లను గెలుచుకుని బల్దియాను చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ను అన్నిరకాలుగా ఉపయోగించుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. మున్నూరుకాపు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సంజయ్కు ముస్లిం మైనారిటీ వర్గాల్లోనూ గట్టి పట్టు ఉండడంతో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి మద్దతు సైతం ఉంది. దీంతో సోషల్ ఇంజినీరింగ్లో భాగంగా ధర్మపురి సంజయ్కు రాష్ట్ర స్థాయిలో పదవి కేటాయించేందుకు సైతం సీఎం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈవిధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళితే బల్దియాలో రెండు జాతీయ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారే అవకాశమున్నట్లు వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ధర్మపురి సంజయ్
నిజామాబాద్ బల్దియాలో గెలుపు కోసం కాంగ్రెస్ ప్రణాళికలు
బీజేపీ హవాను తగ్గించేందుకు వ్యూహాలు రచిస్తున్న అధికార పక్షం
మున్నూరుకాపు, మైనారిటీ
ఓటుబ్యాంకును గంపగుత్తగా
దక్కించుకునేందుకు ప్లాన్
ధర్మపురి సంజయ్కు రాష్ట్రస్థాయి పదవి ఇచ్చేందుకు సీఎం పరిశీలన!
నగరంలో సోషల్ ఇంజినీరింగ్


