రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
డిచ్పల్లి: మండలంలోని కంచెట్టి దాబా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మతి చెందినట్లు ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం.. తెల్లవారుజామున దాబా ఎదురుగా ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి మెడ కుడి వైపునకు టాటూ, ఎడమ, కుడి చేయి మణికట్టుల వద్ద టాటూలు ఉన్నాయి. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659852, 8712659851 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
గాంధారి(ఎల్లారెడ్డి): రోడ్డుపై నిలిపిఉంచిన ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన సోమార్పేట లింగయ్య(60) మంగళవారం తన టీవీఎస్ ఎక్సెల్పై పశువుల దాణా కోసం బాన్సువాడ వెళ్లాడు. రాత్రివేళ పశువుల దాణాను ఎక్సెల్పై తీసుకొని స్వగ్రామానికి బయలుదేరాడు. మొండిసడక్– బాన్సువాడ ప్రధాన రహదారిపై ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్ టైర్ పంక్చర్ కావడంతో అక్కడే నిలిపిఉంచారు. ఈక్రమంలో లింగయ్య ఎక్సెల్పై అదే రోడ్డు గుండా వస్తుండగా ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందిచారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇసుకను కిందికి తోడేసి ట్రాలీని పక్కకు తీసినట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదంపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు.
నాగిరెడ్డిపేట: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్ల పోచయ్య(42) గతేడాది పొలంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి చేయి విరిగింది. విరిగిన చేయికి పలుచోట్ల వైద్యం చేయించినా సరికాలేదు. దీంతో మనస్తాపానికి గురైన పోచయ్య మంగళవారం వేకువజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
● రూ.45 లక్షల నష్టం
నిజామాబాద్ అర్బన్: నగరంలోని వినాయక్నగర్లో ఉన్న పేపర్ప్లేట్స్ తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సదరు కేంద్రంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్మికులు పేపర్ప్లేట్స్ను తయారు చేశారు. మధ్యాహ్నం భోజన విరామంలో కార్మికులు మిషన్లను ఆఫ్ చేయకుండా అలాగే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో మిషిన్లు వేడి కావడంతో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించి తయారీ కేంద్రంలోని పేపర్ప్లేట్స్ కాలిపోయాయి. వాటితో పాటు ఇతర సామగ్రి కూడా దగ్ధమైంది. సుమారు రూ.45 లక్షల నష్టం జరిగినట్లు నాలుగో టౌన్ ఎస్హెచ్వో తెలిపారు.


