
ఎంఎంపీటీఎఫ్ను పక్కాగా అమలుచేస్తాం
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● జిల్లాస్థాయి కమిటీ సభ్యులతో సమీక్ష
నిజామాబాద్అర్బన్: యూఎన్వో ద్వారా ప్రయోగాత్మకంగా నిజామాబాద్ జిల్లాలో అమలు చేస్తున్న మైగ్రేషన్ మల్టీ పార్ట్నర్ ట్రస్ట్ ఫండ్ (ఎంఎంపీటీఎఫ్) కార్యక్రమాన్ని పక్కాగా అమలు పరుస్తూ, జిల్లా యంత్రాంగం తరపున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం ఆయన జిల్లాస్థాయి కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం జరిపారు. జిల్లాలో వలసదారులు, దుర్బల కుటుంబాల స్థితిగతులలో మార్పును తేవాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, పూర్తి పారదర్శకంగా అమలయ్యేలా చూస్తామని అన్నారు. కార్యక్రమం ఉద్దేశ్యం, పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి మండలాలను ఎంపిక చేయడానికి గల కారణాలు, సహా పలు అంశాలపై చర్చించారు. జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఏవో గోవిందు, డీపీఆర్వో పద్మశ్రీ, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, డీడబ్ల్యూవో రసూల్బీ, డీపీవో శ్రీనివాస్, రోహిత్ రెడ్డి, మధు సూదన్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.