
చెల్లుబాటు కాని చెక్కులు
జీతాల చెల్లింపులకు ఇబ్బంది లేదు
బిల్లుల కోసం పంచాయతీ చుట్టూ..
పెండింగ్లో బిల్లులు
● గ్రామ పంచాయతీ ఖాతాల్లోని
సొమ్ము వినియోగించుకోలేని పరిస్థితి
● ఆర్థిక శాఖ నుంచి చెల్లింపులకు
దక్కని అనుమతి
● ఆరు నెలలుగా ఇదే స్థితి
● రూ.కోట్లున్నా అక్కరకు రాని వైనం
మోర్తాడ్(బాల్కొండ): కమ్మర్పల్లి మండలంలోని ఒక గ్రామ పంచాయతీ ట్రెజరీ ఖాతాలో రూ.3లక్షల నిధులు ఉన్నాయి. వివిధ అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించేందుకు చెక్కులను భీమ్గల్ ట్రెజరీ కార్యాలయానికి పంపించారు. ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క చెక్కు కూడా చెల్లుబాటు కాలేదు. ట్రెజరీ ఖాతాలో నిధులు ఉన్నా వినియోగించే పరిస్థితి లేదు. ఇదేమిటని ట్రెజరీ అధికారులను ప్రశ్నిస్తే నిధులు వినియోగించకుండా ఫ్రీజింగ్ విధించారని చెబుతున్నారు. ఇది ఒక్క కమ్మర్పల్లి మండలంలోని పంచాయతీ పరిస్థితే కాదు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల ట్రెజరీ ఖాతాల్లో నిధులున్నా వినియోగించేందుకు వీలులేని పరిస్థితి నెలకొంది. పునర్విభజనకు ముందు జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం, రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇతర రకాల ఆదాయం అంతా ట్రెజరీ ఖాతాల్లోనే జమ అ వుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పంచాయతీల ఖాతాల్లో రూ.20 కోట్ల వరకు నిధులు ఉన్నాయి. ఈ నిధులను పంచాయతీల నిర్వహణ, చిన్నచిన్న అభివృద్ధి పనులు, సామగ్రి కొనుగోలు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ట్రాక్టర్ల ఈఎంఐలు ఇలా ఎన్నో రకాల వాటికి వినియోగించడానికి అవకాశం ఉంది. పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం ప్రభుత్వం జమచేస్తున్న సొమ్ము చెల్లింపులకు మాత్రమే చెక్కులు చెల్లుబాటు అవుతున్నాయి. ఇతర బిల్లుల చెల్లింపులకు పంపించిన చెక్కులు ఆరు నెలల నుంచి అలాగే ఉంటున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి బిల్లుల చెల్లింపులకు ఆమోదం లభించకపోవడంతో ట్రెజరీ కార్యాలయాలకు పంపించిన చెక్కులు అలాగే ఉండిపోయాయి. నెలల తరబడి చెక్కులు చెల్లుబాటు కాకపోవడంతో పంచాయతీల నిర్వహణ కష్టంగా ఉందని కార్యదర్శులు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ పంచాయతీ నిధులను వినియోగించకుండా ఫ్రీజింగ్ విధించడంతో ఖాతాల్లో నిధులు ఉన్నా అక్కరకు రావడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పంచాయతీ నిధుల వినియోగంపై విధించిన ఫ్రీజింగ్ను తొలగించాలని పలువురు కోరుతున్నారు.
గ్రామ పంచాయతీ ట్రెజరీ ఖాతాల నుంచి సిబ్బంది జీతాల చెల్లింపునకు ఇబ్బంది లేదు. ఫ్రీజింగ్ అమలులో ఉన్న కారణంగా అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తరువాతనే నిధులను వినియోగించడానికి వీలు ఉంటుంది.
– శివకృష్ణ, డివిజనల్ పంచాయతీ అధికారి, ఆర్మూర్
గ్రామ పంచాయతీకి నిధులు వస్తాయనే ఉద్దేశంతో ఎన్నో పనులు చేశాం. నిధులు మంజూరైన తరువాత కూడా బిల్లులు చెల్లించడం లేదు. ఆరు నెలల కింద ట్రెజరీకి పంపించిన చెక్కు ఇప్పటి వరకు డ్రా కాలేదు. ప్రభుత్వం స్పందించి బిల్లులు మంజూరు చేయాలి. నిధులు ఉన్నా ఫ్రీజింగ్ కారణంగా ఆర్థికంగా ఇబ్బంది కలుగుతోంది.
– కడారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్, సుంకెట్