నిర్మల్చైన్గేట్:ప్రజావాణికి ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ఏమాత్రం జాప్యం చేయకుండా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆమె పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో భాగంగా ప్రజలు ప్రధానంగా విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను సమర్పించారు. జెడ్పీ సీఈవో మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తున్నారని, వారి వినతులపై అధికారులు సానుకూల దృక్పథంతో స్పందించాలన్నారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


