నిర్మల్: జిల్లాల్లో 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 2న గ్రామసభలు నిర్వహించాలన్నారు. ఈ గ్రామసభలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించి, వారితో సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. వీసీ అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా అధికారులతో మాట్లాడారు. గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలు వెల్లడించాలన్నారు. ఆర్థికంగా, సామాజికంగా లబ్ధిపొందిన వారితో సభల్లో మాట్లాడించాలని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, ిసీపీవో జీవరత్నం, డీపీవో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్, అధికారులకు సన్మానం..
ఇటీవలి ఢిల్లీ వేదికగా రెండు స్కోచ్ అవార్డులు అందుకున్న కలెక్టర్ అభిలాషఅభినవ్, డీఎంహెచ్వో రాజేందర్ తదితరులను జిల్లా అధికారులు సన్మానించారు. పొనికివనం ఏర్పాటు, అమ్మరక్షిత కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కృషి చేశారని కొనియాడారు.
పనితీరుతోనే అధికారికి గుర్తింపు..
తమ ఉద్యోగకాలంలో చేసే పనితీరుతోనే ప్రతీ అధికారికి గుర్తింపు ఉంటుందని కలెక్టర్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన హౌసింగ్ పీడీ రాజేశ్వర్, లోకేశ్వరం తహసీల్దార్ భోజన్నను కలెక్టరేట్లో సన్మానించారు. విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలని కాంక్షించారు.


