ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు కేసు ప్రత్యేక దర్యాప్తు అధికారి రాహుల్ కాంత్, ఐపీఎస్ తెలిపారు. ఆదివారం వన్టౌన్లో వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అర్బాజ్(25) అనే యువకుడికి అదే కాలనీలో నివసిస్తున్న మహిళతో వివాహేతర సంబంధం ఉన్న అనుమానంతో మహిళ భర్త పవార్ రాకేశ్ అలియాస్ లఖన్, అతని అన్న రవి పవార్, తండ్రి గోపాల్ పవార్ కలిసి ప్రణాళిక ప్రకారం యువకుడిపై దాడి చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో బాధితుడిపై కర్రతో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి ఆరీఫ్ ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బృందం శాంతినగర్ ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పవార్ రాకేశ్ అలియాస్ లఖన్ కాగా, మిగితా ఇద్దరు నిందితులు అతని అన్న రవి పవార్, తండ్రి గోపాల్ పవార్ అని తెలిపారు. ముగ్గురు నిందితులు ఒకే కుటుంబానికి చెందిన వారని పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన కర్ర, గొడ్డలి, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించనున్నట్లు పేర్కొన్నారు.


