ఖానాపూర్: మండలంలోని బావాపూర్(కే) గ్రామంలోని గోదావరి తీరంలో పురాతన కాటమయ్య విగ్రహాన్ని గుర్తించారు. కాటమయ్య విగ్రహం కుడిచేతిలో ఖడ్గం ధరించి, తలకు శిరస్త్రాణం పెట్టుకుని, బుగ్గ మీసాలతో, పెద్ద చెవులతో గుర్రంపై స్వారీ చేస్తున్న రూపంలో దర్శనమిస్తోంది. ఈ శిల్పం కొంత భాగం భూమిలో దిగబడిన స్థితిలో ఉంది. విగ్రహం పక్కనే ఎల్లమ్మగా పూజించబడుతున్న మరో శిలను కూడా గుర్తించారు. స్థానిక విశ్వాసాల ప్రకారం కాటమయ్య పశువుల మందలను రక్షించే దేవుడిగా భావిస్తారు. ఈ శిల్పం 18 శతాబ్దానికి చెందినదిగా ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్ కుమార్ ఆదివారం తెలిపారు. ఇక్కడ ప్రాంతీయ చరిత్ర, సాంస్కృతిక వారసత్వంపై మరింత పరిశోధన అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


