సారంగపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు ఉపాద్యాయులు కృషి చేయాలని కలెక్టర్ అభిలాష అభివన్ అన్నారు. మండలంలోని చించోలి(బి) ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనం పరిశీలించడంతోపాటు వారితో కలిసి అక్కడే భోజ నం చేశారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్నభోజనం ఎలా పెడుతున్నారని అడిగి తెలుసుకున్నా రు. తరగతి గదిలో విద్యార్థులను గణిత సమస్యలు బోర్డుపై రాసి సమాధానాలు రాబట్టారు. పాఠశాల రికార్డులు పరిశీలించి విద్యార్థుల, ఉపాద్యాయుల హాజరు వివరాలు ఆరా తీశారు. తర్వాత మధ్యాహ్నభోజన కార్మికులతో మాట్లాడి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలన్నారు. ఈక్రమంలో విద్యార్థులు తమకు పాఠశాలలో భోజనశాల లేదని కలెక్టర్కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ వెంటనే భోజనశాల ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వేగం పెంచాలి..
అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను పూర్తి నాణ్యతతో నిర్మించుకోవాలని తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని బిల్లులు సైతం ఎప్పటికప్పుడు చెల్లిసస్తామన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి బిల్లుల వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లకోసం ఇసుక, మొరం అవసరమైతే తహసీల్దార్ నుంచి అనుమతులు తీసుకుని తరలించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో భోజన్న, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, స్థానిక సర్పంచ్ సాయన్న, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, ఇతర అధికారులు ఉన్నారు.


