మూఢ నమ్మకాలతో ప్రాణాల మీదకు..

Woman Got Injured Over Superstitions In Orissa - Sakshi

భువనేశ్వర్‌ : మూఢ నమ్మకాలు విడనాడాలని ఆదివాసీల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. ఇప్పటికీ దిశారీలు, నాటువైద్యులను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒరిస్సా, నవరంగపూర్‌ జిల్లా చంధాహండి సమితి జునాపాణి గ్రామానికి చెందిన కస్తూరి రొడి(55) కొద్ది రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతోంది. నొప్పి ఎక్కువకావడంతో నాటు వైద్యుడిని ఆశ్రయించి వైద్యం చేయించుకుంది. అయినా ఫలితం లేకపోవడంతో కలహండి జిల్లా ధర్మఘడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు మందులు ఇచ్చి పంపించేశారు. ఆ మందులు వాడినా గొంతు నొప్పి తగ్గకపోవడంతో మరోసారి నాటు వైద్యుడిని ఆశ్రయించింది. ( జీతం కావాలంటే.. లంచం తప్పదు )

అతడు ఆమె గొంతుపై వాతలు పెట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో చందాహండి సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందజేశారు. మూఢ నమ్మకాలతో మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకుందని ఆమెకు చికిత్స అందించిన వైద్యులు అంటున్నారు. ఆదివాసీలు ఇప్పటికైనా మూఢ నమ్మకాలు విడనాడాలని, ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే ఆస్పత్రిలో సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top