కోల్కతా: టీఎంసీ బహిష్కృత నేత రిజుదత్తా బెంగాల్ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సువేందు అధికారి సంయమనంతో దాదాపు ఐదువేల మంది తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తల ప్రాణాలు కాపాడారన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం సువేందు తన వ్యక్తిగత సహాయకుడు దారుణ హత్యకు గురైనప్పటికీ, ప్రతీకారానికి పిలుపునివ్వకుండా శాంతిని పాటించారని లేదంటే భారీ హింస జరిగేదన్నారు.
పశ్చిమబెంగాల్కు మమతా బెనర్జీ తర్వాత సువేందు అధికారే సీఎంగా అర్హుడైన వ్యక్తి అని కొనియాడారు. మమతా బెనర్జీని నందిగ్రామ్లో ఓడించిన రికార్డు ఆయనకు ఉందని, ఆయన రాజకీయ ప్రస్థానం అద్వితీయమని ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రైవేట్ సంస్థైన ఐ-ప్యాక్ చేతుల్లోకి టీఎంసీ వెళ్లిపోయిందని దీనికి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ బాధ్యత వహించాలని దత్తా విమర్శించారు.పార్టీ ఓటమికి అభిషేక్ బెనర్జీ ఒంటెత్తు పోకడలే కారణమని కృష్ణేందు నారాయణ్ చౌదరి, అటిన్ ఘోష్ వంటి సీనియర్ నేతలు సైతం తృణముల్ కాంగ్రెస్ ఓటమికి కారణమన్నారు.
అయితే రిజూదత్తా వ్యాఖ్యలపై టీఎంసీ స్పందించింది. ఇవన్నీ సదరు వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలని, పార్టీకి వీటికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పార్టీ అధికారికంగా ప్రకటించే అంశాలనే ప్రామాణికంగా తీసుకోవాలని కోరింది. కాగా రిజుదత్తా టీఎంసీ ప్రతినిధి క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారనే నెపంతో ఆయనను పార్టీ ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది.
కాగా ఎన్నికల ఫలితాల అనంతరం సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. కారులో వెళుతున్న ఆయనను అడ్డగించిన దుండగులు పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్చిచంపారు. దీనిపై కన్నీటీ పర్యంతమైన సువేందు అధికారి నిందితులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టాది లేదని తేల్చిచెప్పారు.


