ఎయిర్ వైస్ మార్షల్ స్థాయి హోదా పొందిన తొలి ఉన్నతాధికారిణి
న్యూఢిల్లీ: భారత సాయుధ బలగాల చరిత్రలో ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ నూతన చరిత్రను లిఖించారు. వాయుసేన ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్(విద్య)గా ఆమె బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఎయిర్ వైస్ మార్షల్ లేదా ఆ హోదాకు సమానమైన పోస్ట్లో అధికారిణి బాధ్యతలు చేపట్టడం వాయుసేన చరిత్రలో ఇదే తొలిసారికావడం విశేషం. శక్తి శర్మ గతంలో వాయుసేనలో ఎయిర్ కమోండోర్గా సేవలందించారు. ‘‘భారత రక్షణ దళాల్లో ఎయిర్ మార్షల్(సమాన హోదా) స్థాయి పదవిని అధిరోహించిన తొలి మహిళా ఎయిర్ వైస్ మార్షల్గా శక్తి శర్మ నూతనాధ్యాయానికి తెరతీశారు.
భారత వాయుసేన ఘనతలో ఇదొక మైలురాయి’’ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో కొనయాడింది. శక్తి శర్మ 1994లో భారతవాయుసేన విద్యావిభాగంలో చేరారు. వాయుసేన శిక్షణా కేంద్రాలు, ఫీల్డ్ స్టేషన్లు, కమాండ్ హెడ్క్వార్టర్లు, ఎయిర్ హెడక్వార్డర్లలో విభిన్నమైన బాధ్యతలు ఈమె సమర్థవంతంగా నిర్వర్తించారు. వీటితోపాటు ఐఐటీ కాన్పూర్, పుణె విశ్వవిద్యాలయంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ చైర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ స్థాపనలో కీలకభూమిక పోషించారు.
కపుర్తలా సైనిక్ స్కూల్కు ప్రిన్సిపల్గా పనిచేసి త్రివిధ దళాల నుంచి ఒక సైనిక్ స్కూల్కు సారథ్యంవహించిన తొలి అధికారిణిగా రికార్డ్ నెలకొల్పారు. ఈమె విజయాల యాత్ర భారత రక్షణబలగాల్లో అధికారిణులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మూడు దశాబ్దాల కెరీర్లో ఈమె ఐఏఎఫ్ ‘ఘనతతో గగనాన్ని తాకండి’నినాదాన్ని నిరూపించి యువ తరానికి స్ఫూర్తిదాయకంగా మారారు’’ అని రక్షణ శాఖ శ్లాఘించింది.


