రాణి ఈగకు మృత బ్యాక్టీరియాతో తయారు చేసిన మందు
తల్లి రొయ్యలకు ప్రత్యేక గుళికల రూపంలో మేత
యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించే విప్లవాత్మక ఆవిష్కరణ
సాక్షి స్పెషల్ డెస్క్: మానవులు, పశువులు, పక్షుల లాగే ఇప్పుడు తేనెటీగలు, రొయ్యలకు కూడా ప్రత్యేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అమెరికా, కెనడా దేశాల్లో బయోటెక్నాలజీ రంగంలో ఈ దిశగా జరిగిన పరిశోధనలు అద్భుతమైన ఫలితాలను సాధించాయి.
తేనెటీగలు ‘అమెరికన్ ఫౌల్ బ్రూడ్’ను తట్టుకునేలా..
తేనెటీగలు, రొయ్యలకు ఇంజెక్షన్లు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి, శాస్త్రవేత్తలు ’మెటర్నల్ ఇమ్యూన్ ప్రైమింగ్’అనే ప్రత్యేక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. తేనెటీగల కోసం మృత బ్యాక్టీరియాతో తయారు చేసిన వ్యాక్సిన్ను చక్కెర పాకంతో కలిపి రాణి ఈగకు ఆహారంగా ఇస్తారు. రాణి ఈగ శరీరంలోని రోగనిరోధక కణాలు ఈ మందును అండాలకు అందిస్తాయి. దీనివల్ల పుట్టబోయే పిల్ల ఈగలకు పుట్టుకతోనే ‘అమెరికన్ ఫౌల్ బ్రూడ్’అనే వ్యాధిని తట్టుకునే శక్తి లభిస్తుంది.
రొయ్యలకు ’వైట్ స్పాట్ వైరస్’సోకకుండా..
హేచరీలోని తల్లి రొయ్యలకు వ్యాక్సిన్ను ప్రత్యేక గుళికల రూపంలో మేతగా ఇస్తారు. వ్యాక్సిన్ ద్వారా చేకూరే వ్యాధి నిరోధక శక్తి గుడ్లకు తద్వారా పిల్ల రొయ్యలకు అందుతుంది. ఫలితంగా అవి ’వైట్ స్పాట్ వైరస్’బారిన పడకుండా పెరుగుతాయి. ఇదిలా ఉంటే, ముంబైలోని ఐసీఏఆర్కు చెందిన కేంద్రీయ మత్స్య విద్యా సంస్థ (సీఐఎఫ్ఈ) శాస్త్రవేత్తలు రొయ్యల వైట్ స్పాట్ వైరస్ నివారణకు ఒక స్వదేశీ వ్యాక్సిన్ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ట్నర్షిప్ మోడ్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇది ప్రస్తుతం చివరి దశ పరీక్షల్లో ఉంది. 2027 చివరి నాటికి మన ఆక్వా రైతులకు వ్యాక్సిన్ వేసిన రొయ్య పిల్లలు (సీడ్) అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
ప్రధాన ప్రయోజనాలు
ప్రపంచవ్యాప్తంగా పంటల పరాగ సంపర్కానికి తేనెటీగలు, ప్రొటీన్ ఆహారంగా రొయ్యలు చాలా కీలకం. ఈ వ్యాక్సిన్ల వల్ల రొయ్యలు, తేనెటీగలలో వ్యాధుల నివారణకు వాడే రసాయనాలు, యాంటీబయాటిక్స్ వాడకం తగ్గుతుంది.పర్యావరణానికి, ప్రజారోగ్యానికి మేలుజరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


