నేడు భారత్‌కు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌.. మోదీతో స్పెషల్‌ ప్రోగ్రామ్‌.. | Republic Day Chief Guest Emmanuel Macron's India Visit Today | Sakshi
Sakshi News home page

నేడు భారత్‌కు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌.. మోదీతో స్పెషల్‌ ప్రోగ్రామ్‌..

Jan 25 2024 7:54 AM | Updated on Jan 25 2024 8:55 AM

Republic Day Chief Guest Emmanuel Macron India Visit Today - Sakshi

ఢిల్లీ: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మాక్రాన్‌ నేడు భారత్‌కు చేరుకుంటారు. మాక్రాన్‌ నేరుగా రాజస్థాన్‌లోని జైపూర్‌ విమానాశ్రయంలో గురువారం ల్యాండ్‌ అవుతారు. 

వివరాల ప్రకారం.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా మాక్రాన్‌ గురువారం భారత్‌కు చేరుకుంటారు. జైపూర్‌ విమానాశ్రయంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత మోదీతో కలిసి మాక్రాన్‌ జైపూర్‌లోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. అలాగే, రాంబాగ్‌ ప్యాలెస్‌లో మాక్రాన్‌ కోసం ప్రైవేటు డిన్నర్‌ ప్రోగ్రామ్‌ ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. 

రోడ్‌ షో..
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన 16వ శతాబ్దానికి చెందిన అమెర్ ఫోర్ట్‌ను సందర్శించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఇద్దరు నేతలు ట్రిపోలియా గేట్‌కు కాలినడకన వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జైపూర్‌లో ఇద్దరు నేతలు రోడ్‌ షో నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన తర్వాత మాక్రాన్‌ గురువారం రాత్రికి దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. జనవరి 26వ తేదన జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ రెండు రోజుల పర్యటనలో భారత్‌తో మాక్రాన్‌ పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్‌ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికత తదితర రంగాల్లో ఒప్పందాలు జరుగనున్నట్టు సమాచారం. ఇ​క, ఫ్రాన్స్‌.. భారత్‌కు ఆయుధాలను అందిస్తున్న రెండో అతిపెద్ద మిత్ర దేశంగా కొనసాగుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement