
ములుగు, సాక్షి: చత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో ములుగు కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్ కగార్(Operation Kagar) మూడో రోజు కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ధర్మతాళ్లగూడెం వద్ద అర్ధరాత్రి నుంచి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో ఇప్పటిదాకా.. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. ఇద్దరు జవాన్లు గాయపడగా.. బీజాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మరోవైపు.. గత మూడు రోజులుగా కొనసాగుతున్న భారీ సెర్చ్ ఆపరేషన్ ఆధారంగా మావోయిస్టులు భారీ సంఖ్యలో మృతి చెంది ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. గాలింపు చర్యల్లో డీఆర్జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు, మూడు రాష్ట్రాల పోలీసులు పాల్గొంటున్నారు. ఐదు వేల మంది మాత్రమే కర్రెలగుట్టను రౌండప్ చేశారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. కానీ,
పలు ఆంగ్ల మీడియా ఛానెల్స్ మాత్రం ఆ సంఖ్య పదివేల దాకా ఉండొచ్చని చెబుతోంది. సుమారు 2,500 మంది మావోయిస్టులు దాగి ఉన్న సమాచారంతో.. వేలమంది పోలీస్, కేంద్ర భద్రతా బలగాల సిబ్బంది కర్రిగుట్టలను చట్టుముట్టిట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా మూడు హెలికాప్టర్లు, పదుల సంఖ్యలో డ్రోన్ల ద్వారా ములుగు అటవీ ప్రాంతం(Mulugu Forest)లో కూంబింగ్ కొనసాగుతోంది.
మాకేం సంబంధం లేదు
కర్రిగుట్టలో జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్.. కూంబింగ్కు తమకు సంబంధం లేదని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా ఛత్తీస్గఢ్- కేంద్ర బలగాలు చూసుకుంటున్నాయని, తమకు ఎలాంటి సమాచారం కూడా లేదని ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి ప్రకటించారు.
కూబింగ్లో పాల్గొంటున్న కేంద్ర భద్రత బలగాలకు మంచినీరు, ఆహారం, తుపాకులు, మందు గుండు సామాగ్రిని పోలీసులు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండడంతో.. కర్రిగుట్టల అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరగవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు.. ఛత్తీస్గడ్ వైపు నుంచి ఊసూర్ బ్లాక్లోని కర్రెగుట్టల(Karreguttalu) సమీపంలో మంగళవారం కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కానీ, కాల్పులను పోలీసులు ధృవీకరించలేదు. కేవలం సెర్చింగ్ ఆపరేషన్ మాత్రమే చేస్తున్నామని చెబుతున్నారు.
కర్రెగుట్ట అటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇటీవల మావోయిస్టుల నుండి కర్రెగుట్టల్లో బాంబులు అమర్చామని.. గుట్టల్లోకి ఎవరు రావొద్దంటూ లేఖ విడుదల చేశారు. ఈ లేఖపై ములుగు ఎస్పీ శబరీష్(SP Shabarish) స్పందించారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడి ఆదివాసులు బతుకుతున్నారని, బాంబుల పేరుతో వారిని బెదిరించడం సమంజసం కాదన్నారు. చట్టవిరుద్ధ పనులు చేస్తున్న మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు..
మావోయిస్టుల లేఖతో అప్రమత్తమైన కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ మడవి హిడ్మా, హీడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుద బలగాలకు ఉప్పందించనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

కూంబింగ్ సరికాదు
ఇదిలా ఉంటే.. కేంద్రం, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ ప్రభుత్వాలు వెంటనే కాల్పుల విరమణను పాటించి, మావోయిస్టులతో శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాలని పీస్ డైలాగ్ కమిటీ(పీడీసీ) చైర్మన్ జస్టిస్ బి.చంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. కర్రెగుట్టలకు సంబంధించి పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ వెంటనే కాల్పులు ఆపాలని డిమాండ్ చేశారు. ఓ వైపు శాంతి చర్చల ప్రతిపాదన తెస్తూనే ఇటువంటి హత్యకాండకు ప్రభుత్వాలు తెగబడటం దుర్మార్గమన్నారు. ఈ ముసుగులో సాధారణ ప్రజానీకం మరణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారాయన. ప్రభుత్వం నుంచి ముందుగా శాంతి చర్చల అడుగులు పడాలని, ఆ ప్రతిపాదన మావోయిస్టుల నుంచి కూడా వచ్చిందని గుర్తు చేశారు. శాంతి చర్చలకు అడుగులు పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో భద్రతా బలగాలను ఉసిగొల్పి మావోయిస్టులను పూర్తిస్థాయిలో అంతమొందించాలని చూడటంతో ఒక దుర్మార్గమైన చర్య అంటూ హరగోపాల్ వ్యాఖ్యానించారు.