ఆపరేషన్‌ కంబోడియా సక్సెస్‌.. శభాష్‌ వైజాగ్‌ పోలీస్‌! | Operation Cambodia Success And 420 Indians Rescued | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ కంబోడియా సక్సెస్‌.. 420 మంది భారతీయులు సేఫ్‌

May 23 2024 11:47 AM | Updated on May 23 2024 12:06 PM

Operation Cambodia Success And 420 Indians Rescued

సాక్షి, విశాఖ: ఆపరేషన్‌ కంబోడియా విజయవంతమైంది. కంబోడియాలో మరో 60 మంది భారతీయులను ఇండియన్‌ ఎంబసీ అధికారులు కాపాడారు. దీంతో, కంబోడియా నుంచి సురక్షితంగా బయటపడిన వారి సంఖ్య 420కి చేరుకుంది.

కాగా, భారత ఎంబసీ అధికారులు ఆపరేషన్‌ కంబోడియాను విజయవంతం చేశారు. సైబర్‌ నేరాల బారినపడి కంబోడియాలో చిక్కుకున్న భారతీయులను ఎంబసీ అధికారులు రక్షించారు. తాజాగా మరో 60 మంది భారతీయులను కాపాడారు. దీంతో, 420 మంది భారతీయులు ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారు. కాగా, నిన్న(బుధవారం) 360 మందిని అధికారులు పోలీసుల చర నుంచి విడిపించారు. ఇక, 420 మందిలో ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారని సమాచారం.

ఈ సందర్భంగా భారత రాయబారి దేవయాని ఖోబ్రగడే కంబోడియాలో ఇండియన్‌ కమ్యూనిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవయాని మాట్లాడుతూ.. మన భారతీయులను మనమే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. భారతీయులకు మద్దతు ఇవ్వడం.. వారి భద్రత, శ్రేయస్సు కోసం రాయబార కార్యాలయం అంకితభావంతో పనిచేస్తుందన్నారు.  ఈ క్రమంలోనే కంబోడియా అధికారులకి ధన్యవాదాలు తెలిపారు.

అయితే.. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్‌’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.

విదేశాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్‌ విజయ్‌కుమార్‌ సోషల్‌ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్‌ల మీదుగా కంబోడియాకు పంపించారు.

అక్కడ మరో గ్యాంగ్‌ బాధితులను రిసీవ్‌ చేసుకొని కంబోడియాలో పాయిపేట్‌ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్‌ వీసా చేయించి ఆ గ్యాంగ్‌ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్‌ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్‌ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సైబర్‌ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. విశాఖ సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement