మోదీ, రాహుల్‌ గాంధీలకు ‘బహిరంగ చర్చ’ ఆహ్వానం | N Ram Invite PM Narendra Modi and Rahul Gandhi To Public Debate On Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

మోదీ, రాహుల్‌ గాంధీలకు ‘బహిరంగ చర్చ’ ఆహ్వానం

May 9 2024 5:01 PM | Updated on May 9 2024 5:38 PM

N Ram Invite PM Narendra Modi and Rahul Gandhi To Public Debate On Lok Sabha Elections

ఢిల్లీ: భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీల కీలక నేతలు ఎలక్షన్ క్యాంపెయిన్​లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ర్యాలీలలో, బహిరంగ సభల్లో.. ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు. ఈ తరుణంలో సీనియర్ జర్నలిస్ట్ & ది హిందూ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ 'ఎన్ రామ్' లోక్‌సభ ఎన్నికల బహిరంగ చర్చకు ఆహ్వానం పేరుతో 'ప్రధాని మోదీ, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ'లకు ఓ బహిరంగ లేఖ అంటూ తన ఎక్స్(ట్విటర్) ఖాతలో పోస్ట్ చేశారు.

ఇప్పటికే లోక్‌సభ ఎన్నికలు మధ్యస్థానికి చేరుకున్నాయి. ర్యాలీలు, బహిరంగ ప్రసంగాలలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజాస్వామ్యానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను ఎన్నో లేవనెత్తారు. ఇందులో రిజర్వేషన్లు, ఆర్టికల్ 370, సంపద పునర్విభజనకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానిని ఉద్దేశించి.. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్, చైనా పట్ల ప్రభుత్వ ప్రతిస్పందన వంటి వాటికి సంబంధించిన ప్రశ్నలు కురిపిస్తూ.. బహిరంగ చర్చకు సవాలు చేశారు. అంతే కాకుండా ఇరుపక్షాలు తమ తమ మ్యానిఫెస్టోల గురించి పరస్పరం ఆరోపంచుకున్నారు, విమర్శనాస్త్రాలు కూడా కురిపించుకున్నారు.

మేము రెండు (బీజేపీ & కాంగ్రెస్) పార్టీల ఆరోపణలు, సవాళ్లను మాత్రమే విన్నాము. అయితే ఎవరూ అర్థవంతమైన వివరణ ఇవ్వలేదు. ప్రచారంలో నేతల ప్రసంగాలను కూడా నేటి డిజిటల్ ప్రపంచం తారుమారు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీల కీలక నేతలు వారు చెప్పాల్సిన అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

బహిరంగ చర్చ ద్వారా రాజకీయ నాయకులు చెప్పే అంశాలను ప్రజలు నేరుగా విని అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాము. ఇందులో ప్రతి పక్షాల ప్రశ్నలను మాత్రమే కాకుండా, ప్రతిస్పందనలను కూడా ప్రజలు వినటానికి అవకాశం ఉంది. ఇదే ప్రక్రియ రాబోయే తరాలకు కూడా చాలా ఉపయోగకారముగా ఉంటుందని మేము భావిస్తున్నామని బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం. భారతదేశంలో ఎన్నికలంటే ప్రపంచం చూపు మనదేశం మీదనే ఉంటుంది. ఈ సమయంలో బహిరంగ చర్చ దేశ ప్రజలకు మాత్రమే కాకుండా.. ప్రపంచ దేశాలకు కూడా మన శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని చాటి చెప్పడానికి ఓ ఉదాహరణగా నిలుస్తుందని లేఖలో ప్రస్తావిస్తూ.. దీనికి రిప్లై ఇవ్వాలని కోరారు.

ప్రస్తుతం ఈ బహిరంగ లేఖ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు దీనిపైన ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే.. ఎలా స్పందిస్తారు? బహిరంగ సభకు సుముఖత చూపుతారా? లేదా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement