180 KM.. ఐదు ఆస్పత్రులు.. ఆర్మీ అధికారి కొడుకు ప్రాణం తీసిన నిర్లక్ష్యం! | Medical Negligence Uttarakhand Shivansh Incident Details | Sakshi
Sakshi News home page

180 KM.. ఐదు ఆస్పత్రులు.. ఆర్మీ అధికారి కొడుకు ప్రాణం తీసిన నిర్లక్ష్యం!

Aug 1 2025 12:30 PM | Updated on Aug 1 2025 1:14 PM

Medical Negligence Uttarakhand Shivansh Incident Details

డెహ్రాడూన్‌: ఐదు ఆసుపత్రుల్లో వైద్యులు నిర్లక్ష్యంగా కారణంగా 14 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. నాలుగు జిల్లాల్లోని ఐదు ఆస్పత్రులకు  చిన్నారిని చికిత్స కోసం తిప్పినప్పటికీ తన బిడ్డను దక్కించుకోలేకపోయాయని తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. దేశం కోసం తాను సరిహద్దుల్లో కాపలాగా ఉన్నందుకు తన బిడ్డను కోల్పోయినట్టు చిన్నారి తండ్రి, ఆర్మీ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన షాకింగ్‌ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. ఇక, ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి దర్యాప్తునకు ఆదేశించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఆర్మీ అధికారి దినేష్ చంద్ర జోషి, శ్రీ జోషి దంపతుల కుమారుడు శివాంష్ జోషి(14 నెలలు). దినేష్ చంద్ర జోషి భారత సరిహద్దుల్లో జమ్ముకశ్మీర్‌లో విధుల్లో ఉన్నారు. శ్రీ జోషి, శివాంష్ జోషి తమ స్వగ్రామంలో(ఉత్తరాఖండ్‌) ఉంటున్నారు. అయితే, జూలై 10న శివాంష్ జోషికి వాంతులు కావడంతో తల్లిపాలు ఇవ్వడం సాధ్యం కాలేదు. దీంతో చిన్నారి డీహైడ్రేషన్‌కు గురయ్యాడు. చిన్నారిని తీసుకుని తల్లి స్థానికంగా చమోలిలోని గ్వాల్డామ్‌లోని ప్రజారోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. అక్కడ సరైన సిబ్బంది లేకపోవడంతో.. బాగేశ్వర్‌లోని బైజ్‌నాథ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు రిఫర్ చేశారు. చిన్నారిని తీసుకుని 22 కి.మీ దూరంలో తల్లి అక్కడికి చేరుకుంది. అయితే, పీహెచ్‌సీలో పిల్లల వైద్యుడు లేకపోవడం, చికిత్స చేయడానికి సౌకర్యాలు లేవని సిబ్బంది తెలిపారు. వెంటనే స్థానికంగా ఉన్న సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారికి కొంత చికిత్స అందించారు. కానీ, వైద్యం సరిపోకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో, అక్కడి వైద్యులు.. మరో 20 కి.మీ దూరంలో ఉన్న బాగేశ్వర్‌లోని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు.

బిడ్డను తీసుకున్న హుటాహుటిన తల్లి.. జిల్లా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు చేరుకుంది. అక్కడున్న వైద్యులు, నర్సులు.. చిన్నారికి సరైన వైద్యం అందించలేదు. చిన్నారిని పరిశీలించకుండానే.. అల్మోరాకు రిఫర్ చేశారు. ఈ క్రమంలో అంబులెన్స్‌ సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రయత్నించగా.. రాత్రి 7 గంటలకు అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే స్పందించలేదు. దీంతో చిన్నారి తల్లి జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫోన్ చేసి సహాయం కోరిన తర్వాత రెండున్నర గంటలు ఆలస్యంగా వాహనం వచ్చింది. తీరా అక్కడికి వెళ్లాక బిడ్డ మెదడులో రక్త ప్రవాహ అవరోధంతో బాధపడుతున్నాడని పీడియాట్రిక్ ఐసీయూ యూనిట్ లేకపోవడంతో వైద్యుడు ఉన్నత కేంద్రానికి వెళ్లాలని సూచించాడు. చివరికి రాత్రి 9:30 గంటలకు నాలుగో ఆసుపత్రి అయిన అల్మోరా మెడికల్ కాలేజీకి తరలించారు.

ఇక, చిన్నారికి చికిత్స అందించారు కానీ మళ్లీ నైనిటాల్‌లోని హల్ద్వానీలోని ఆసుపత్రికి రిఫర్ చేశారు. జూలై 12న హల్ద్వానీలో వైద్యులు బిడ్డను వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే నాలుగు రోజుల తర్వాత జూలై 16న బాలుడు చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయాడని వాపోయారు. ఈ ఘటన ముఖ్యమంత్రి వరకు చేరడంతో సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి దర్యాప్తునకు ఆదేశించారు. 

ఈ ఘటనపై చిన్నారి తండ్రి స్పందిస్తూ.. అంతా అయిపోయింది. ఒక నిస్సహాయ సైనికుడి తండ్రి సరిహద్దు నుండి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కానీ అంబులెన్స్ సమయానికి రాలేదు. అతనితో సరిగ్గా మాట్లాడలేదు. ఉత్తరాఖండ్‌లోని ప్రతి ఇంట్లో ఒక సైనికుడు ఉంటాడు. అసెంబ్లీలో కొండప్రాంత ప్రజలను అవమానించే మంత్రి ఉన్న ఈ ప్రభుత్వంలో సైనికుల కుటుంబాలకు వారు ఆదుకుంటారు అని ఆశించడం పూర్తిగా వ్యర్థం అని ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్నారి తల్లి మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లోని సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగానే నా బిడ్డ చనిపోయాడు. తనను తాను జాతీయవాదిగా చెప్పుకునే అవినీతి ప్రభుత్వం ఒక సైనికుడి కొడుకును కాపాడలేకపోయింది! అంటూ మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement