ఎల్డీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన కేరళ సీఎం విజయన్
కోజికోడ్: కేరళ అసెంబ్లీ ఎన్నికలకుగాను అధికార ఎల్డీఎఫ్ మేనిఫెస్టోను సీఎం పినరయి విజయన్ గురువారం విడుదల చేశారు. సంపూర్ణ పేదరిక నిర్మూలన, పింఛను రూ.3 వేలకు పెంపు, ఉద్యోగావకాశాల పెంపు, పెట్టుబడులను ఆకర్షించడం..తదితర కీలక హామీలు ఇందులో ఉన్నాయి. సామాజిక న్యాయంతోకూడిన ఆర్థికాభివృద్ధి, రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ మేనిఫెస్టో ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం విజయన్ చెప్పారు.
మేనిఫెస్టోలోని మొత్తం 950 ప్రతిపాదనలను ప్రజలందరికీ సులువుగా అర్థమయ్యేలా 60–సూత్రాల కార్యక్రమంగా సంక్షిప్తం చేశామన్నారు. ప్రజా సంక్షేమమే కేంద్రంగా అభివృద్ధి, పారిశ్రామిక విధానాలను రూపొందిస్తామ న్నారు. నెలవారీ సంక్షేమ పింఛను మొత్తాన్ని ప్రస్తుతమిస్తున్న రూ.1,600 నుంచి రూ.2 వేలకు పెంచనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.


