తిరువనంతపురం: మొదటి భార్య వాదనలు వినకుండా ముస్లిం వ్యక్తి రెండో వివాహం నమోదు చేయకూడదని కేరళ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆమె అభ్యంతరం చెబితే రిజిస్ట్రార్ వెంటనే రిజిస్ట్రేషన్ను నిలిపివేసి ఆ విషయాన్ని కోర్టుకు సూచించాలని పేర్కొంది. మొదటి వివాహం చెల్లుబాటులో ఉండగా ముస్లిం పురుషుడు రెండో వివాహాన్ని నమోదు చేసుకోవాలనుకుంటే మొదటి భార్యకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు సూచించింది.
తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకునేందుకు ఆదేశాలు కోరుతూ ముహమ్మద్ షరీఫ్, అతని రెండో భార్య దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం పై విధంగా స్పందించింది. ఈ కేసులో మొదటి భార్యను చేర్చనందుకు పిటిషన్ను తోసిపుచ్చింది. ముస్లిం పర్సనల్ లా కొన్ని పరిస్థితుల్లో రెండో వివాహాన్ని అనుమతిస్తున్నప్పటికీ మొదటి భార్య తన భర్త రెండో వివాహ రిజిస్ట్రేషన్కు ప్రేక్షకురాలిగా ఉండకూడదని కోర్టు అభిప్రాయపడింది. మొదటి భార్య అభ్యంతరం వ్యక్తంచేస్తే ఆ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. అభ్యంతరాలు వినడానికి, వివాదాలను సివిల్ కోర్టులకు సూచించడానికి వివాహ రిజిస్ట్రేషన్ అధికారులకు అధికారం ఉందని కోర్టు పేర్కొంది.


