శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా కేంద్రంలో దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్ కేసు బయటపడింది. కొన్నిరోజుల కిందట దుబాయ్ నుంచి బెంగళూరులో దిగి అక్కడి నుంచి శివమొగ్గకు వెళ్లిన వ్యక్తి (53)కు కొత్త కరోనా సోకినట్లు నిర్ధారించారు. శివమొగ్గలో ఇంట్లో వారంరోజుల పాటు క్వారంటైన్లో ఉన్న తరువాత బయటకు వచ్చి తిరిగాడు. అనుమానంతో మరోసారి కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని వెల్లడైంది. కొత్త రకం కరోనా అని పరీక్షించగా దక్షిణాఫ్రికాలో ఇటీవల గుర్తించిన స్ట్రెయిన్గా తేలింది. బాధితుడికి జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేకంగా వైద్యమందిస్తున్నారు.
23,285 కరోనా కొత్త కేసులు
భారత్లో గడిచిన 24 గంటల్లో 23,285 కరోనా పాజిటివ్ కేసులు, 117 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కోవివ్ కేసుల సంఖ్య 1,13,08,846కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. యాక్టివ్ కేసులు సంఖ్య 1,97,237గా ఉంది. రికవరీ రేటు 96.86గా నమోదయింది.