నిరసనల వేళ అగ్నివీర్లపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Kailash Vijayvargiya Comments On Agniveers - Sakshi

దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌పై ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ‍్యలు చేశారు. అగ్నివీరులకు బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ ఉద్యోగాలు ఇస్తామంటూ కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

వివరాల ప్రకారం.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ.. అగ్నివీర్లపై వివాదాస్పద కామెంట్స్‌ చేశారు. అగ్నిపథ్‌పై నిరసనల నేపథ్యంలో విజయవర్గీయ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒక అగ్నివీర్ సైనిక శిక్షణ పొంది, నాలుగు సంవత్సరాల తర్వాత సేవ నుండి నిష్క్రమించినప్పుడు రూ.11 లక్షలు అందుకుంటాడు. అగ్నివీర్ బ్యాడ్జ్‌ని ధరిస్తాడు. బీజేపీ కార్యాలయానికి సెక్యూరిటీని నియమించాలనుకుంటే, నేను అగ్నివీర్‌కు ప్రాధాన్యత ఇస్తా’ అని వ్యాఖ్యలు చేశారు. 

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో విపక్ష నేతలు.. కైలాష్‌ వర్గీయపై మండిపడ్డారు. ఢిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌.. కైలాష్‌ వర్గీయపై నిప్పులు చెరిగారు. దేశ యువత, భారత ఆర్మీని అగౌరవపర్చవద్దని హితవు పలికారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కైలాష్ విజయవర్గీయ మాటలతో అగ్నిపథ్‌ స్కీమ్‌పై ఉన్న అన్ని అనుమానాలు తొలగిపోయాయని విమర్శలు చేసింది. ఇందుకోసమేనా అ‍గ్నిపత్‌ స్కీమ్‌కు తీసుకువస్తున్నారంటూ ఎద్దేవా చేసింది. అగ్నివీరులు సెక్యూరిటీ గార్డులుగా ఉండేందుకు కూడా మన ఆర్మీ శిక్షణ ఇస్తున్నది అంటూ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top