న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ గార్డెన్ రీచ్ షిప్బిల్డింగ్, ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన మూడు నూతన నౌకలు దునగిరి, సంశోధక్, ఆగ్రే సోమవారం భారత నావికా దళం చేతికొచ్చాయి. వీటి రాకతో నావికా దళ శక్తిసామర్థ్యాలు మరింత పటిష్టంకానున్నాయి. దునగిరి అనేది నీలగిరి తరగతి నౌక. 1977 నుంచి 2010 ఏడాదిదాకా భారత నావికా దళంలో సేవలందించిన పాత ‘ఐఎన్ఎస్ దునగిరి’స్థానంలో కొత్తగా ప్రాజెక్ట్–17ఏ కింద కొత్త దునగిరి నౌకను నిర్మించారు. బ్రహ్మోస్ క్షిపణితోపాటు రాకెట్లు, టోర్పెడోలను ఈ నౌక నుంచి ప్రయోగించవచ్చు.
డిజైన్, దాడి సామర్థ్యం, ఆటోమేషన్, నిఘాతోపాటు స్వావలంబనలో ఈ నౌక తిరుగులేనిదని భారత నేవీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సంశోధక్ అనేది సర్వే బాధ్యతలు చూసే నౌక. తీర ప్రాంతాల్లో గస్తీకాయడంతోపాటు నౌకాశ్రయాల వద్ద సముద్ర లోతును ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. రక్షణతోపాటు పౌర అవసరాలకు సంబంధించి ఒషనోగ్రాఫిక్, జియోఫిజికల్ సమాచారాన్ని అందివ్వగలదు. డిజిటల్ సైడ్ స్కాన్ సోనార్, ఆటానమస్ అండర్వాటర్ వెహికల్, రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ వంటి అదనపు సదుపాయాలు దీనిలో ఉన్నాయి. ఆగ్రే అనేది అర్నానా తరగతి యాంటీ–సబ్మెరైన్ యుద్ధనౌక. 2017లో విధుల నుంచి ని్రష్కమించిన ఐఎన్ఎస్ ఆగ్రేకు బదులుగా కొత్త ఆగ్రే నౌకను నిర్మించారు.


