గుజరాత్లోని సూరత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీ కొని మంటలు చెలరేగాయి. దీంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదస్థలి వద్ద పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఘోరంగా ఢీకొన్న ఈ రెండు బస్సులు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినవే. ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం 5.15 గంటలకు జరిగింది. సూరత్లోని బార్డోలీ తాలూకా ఉవా గ్రామం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం.
ఈ ప్రమాదంలో రెండు బస్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మరో బస్సు బోల్తాపడింది. అందులో వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. దీంతో మరింత మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రమాదానికి గురైన బస్సుల్లో ఒకటి ధూలే-సూరత్ మార్గంలో నడుస్తోంది. ఈ బస్సు ధూలే నుంచి నందుర్బార్, నవాపూర్ మీదుగా సూరత్కు వెళ్తోంది. మరో బస్సు గుజరాత్ నుంచి మహారాష్ట్ర వైపు ప్రయాణిస్తోంది.
ఒక బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది డివైడర్ను ఢీకొట్టింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న మరో బస్సు ప్రమాదాన్ని తప్పించుకునే ప్రయత్నంలో పక్కకు మళ్లింది. అయితే ఆ క్రమంలో బస్సు బోల్తాపడింది. బోల్తాపడగానే మంటలు అంటుకున్నట్టు సమాచారం.


