లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో కొందరు యువకులు ఒక డాల్ఫిన్ను కిరాతకంగా చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూగజీవి అనే కనికరం లేకుండా డాల్ఫిన్ పట్ల క్రూరంగా వ్యవహరిస్తూ కత్తులు, కర్రలతో కొట్టి హతమార్చారు. ఈ జుగుప్సాకర సన్నివేశం డిసెంబర్ 31న యూపీలోని ప్రతాప్ఘర్ జిల్లాలో జరిగింది. వివరాలు.. ప్రతాప్ఘర్ జిల్లాలోని కొతారియా గ్రామం సమీపంలో ఉన్న శారద కెనాల్కు కొంతమంది యువకులు చేపల వేటకు వచ్చారు.
వలలో పెద్ద చేప చిక్కిందన్న సంతోషంలో ఉన్న యువకులు అదే ధోరణిలో దానిపై దాడి చేశారు. ఇదే సమయంలో మరో గుంపు కూడా అక్కడికి చేరుకొని వారికి జత కలిశారు. అయితే వారికి దొరికింది ఒక డాల్ఫిన్ అన్న విషయాన్ని గుర్తించి కూడా దానిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. కత్తులతో డాల్ఫిన్ శరీరాన్ని రెండు బాగాలు చేసి తమ పైశాచిక ఆనందాన్ని పొందారు. అనంతరం దానిని చంపి కెనాల్లోనే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.(చదవండి: ప్రెగ్నెన్సీ కోసం లడఖ్కు విదేశీ యువతుల క్యూ)
దీనిని ఒక యువకుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ యువకులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 9/51 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ యువకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.