పరిపాలన, ఆరోగ్యరంగంపై ప్రత్యేక దృష్టి
అస్సాంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన రాహుల్ గాంధీ
గువాహటి: మూలవాసులుగా గుర్తించిన ఆరు తెగలకు ఎస్టీ హోదా, పాలన, ఆరోగ్యం, పారిశ్రామికీకరణ తదితర 11 రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత..కీలకాంశాలుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లా బోకాజాన్లో ‘రైజోర్ ఇష్టాహార్’పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో యాంటీ కరప్షన్ కమిషన్ ఏర్పాటు, కార్పొరేట్ సంస్థలకు భారీ భూకేటాయింపులపై సిట్తో దర్యాప్తు, పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవు తప్పనిసరి చేయడం వంటి హామీలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాష్ట్రంలో ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించిన ఐదు గ్యారంటీలకు ఇవి అదనం.
→ అస్సాంలోని మొరాన్, మొటోక్, చుటియా, టై–అహోం, కొచ్–రాజ్»ొంగ్షిలతోపాటు తేయాకు తోటల్లో పనిచేసే గిరిజనులకు ఎస్టీ హోదా కల్పించడం.
→ టీ పరిశ్రమను ప్రధాన పరిశ్రమగా గుర్తించడం. టీ వర్కర్లకు పరిశ్రమల్లో మాదిరిగా కనీసం వేతనాలు, ఇతర ప్రయోజనాలను కల్పించడం.
→ బీటీసీ, కేఏఏసీ, దిమా హసావో కౌన్సిళ్లను ఆర్థికంగా మరింత చేయూతనివ్వడం, మరిన్ని అధికారాలను కల్పించడం, గిరిజన తెగలకు తిరిగి పునరావాసం కల్పించడం.
→ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలిపే శ్వేతపత్రం విడుదల, ఆస్పత్రులు, స్కూళ్లలో ఖాళీల భర్తీ వంటి ఐదు కార్యక్రమాల అమలు.
→ పూర్తి అధికారాలతో స్వతంత్ర అవినీతి వ్యతిరేక కమిషన్ ఏర్పాటు. పంచాయతీ రాజ్ సంస్థలకు వార్షిక గ్రాంట్ల విడుదల, జవాబుదారీతనం పెంపు. పోలీసు యంత్రాంగంలో సంస్కరణలు. జిల్లా ఆస్పత్రుల హోదా పెంపు, డిజిటల్ క్లాస్రూంల ఏర్పాటు.
→ ఐదేళ్లలో మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేయడం. అన్ని రకాల ప్రభుత్వ సేవలను డిజిటైజ్ చేయడం. అందరికీ ఆరోగ్యం, స్కూళ్లలో వంద శాతం హాజరీ, ఉద్యోగిత పెంపు, ఆదాయం రెట్టింపు వంటివి అమలు.


