భోపాల్: చీటింగ్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హతకు గురయ్యారు. 1998–2011 సంవత్సరాల మధ్య కాలంలో గ్రామీణ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరించిన రాజేంద్ర భారతి ఫిక్స్డ్ డిపాజిట్ల పేరిట బ్యాంక్ రికార్డులను ఫోర్జరీ చేసి వడ్డీ రూపంలో రూ.18.5 లక్షలు కాజేశారన్న ఆరోపణలు రుజువు కావడంతో గురువారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించడం తెల్సిందే. ఈ నేరంలో పాలుపంచుకున్న బ్యాంకు క్యాషియర్ రఘువీర్కు కూడా రూ.లక్ష జరిమానా విధించింది.
ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి రాష్ట్ర విధాన సభ ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్, దాటియా ఎమ్మెల్యే భారతిని అనర్హుడిగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో గతేడాది అక్టోబర్లో ఈ కేసును మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. తమ ఎమ్మెల్యే రాజేంద్ర భారతిని అనర్హుడిగా ప్రకటిస్తూ గురువారం అర్ధరాత్రి హడావుడిగా అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత, మాజీ మంత్రి నరోత్తమ్ మిశ్రాపై రాజేంద్ర భారతి విజయం సాధించడం గమనార్హం.


